మాయావతికి భారీ ఎదురుదెబ్బ
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆదాయపు పన్ను శాఖ మాయావతికి గట్టి షాక్ ఇచ్చింది. మాయావతి సోదరుడు ఆనంద్ కుమార్కు చెందిన ఏడెకరాల భూమిని ఐటీ అధికారులు జప్తు చేశారు. ఈ ఆస్తి బుక్ వాల్యూనే 400 కోట్ల రూపాయలు ఉంటుందని సమాచారం. దీనికి సంబంధించి జూలై 16న ఐటీ శాఖ బినామీ ప్రొహిబిషన్ యూనిట్ తాత్కాలిక నోటీసులు జారీ చేసింది. ఆనంద్ కుమార్తో పాటు ఆయన భార్య విచితర్ లత పేరుమీదున్న న్యూఢిల్లీ, నోయిడా పరిధిలోని ఆస్తులను జప్తు చేశారు.
ఆనంద్ కుమార్ తొలుత నోయిడా అథారిటీలో క్లర్కుగా పనిచేశారు. అనంతరం నకిలీ కంపెనీల పేరుతో కోట్ల రూపాయల రుణాలు పొందినట్లు ఆరోపణలున్నాయి. 2007లో మాయావతి ముఖ్యమంత్రిగా ఉన్న ప్పుడు ఆయన 49 కంపెనీలు ప్రారంభించారు. ఆయన ఆస్తుల విలువ 1316 కోట్లకు చేరింది. దీనిపై అప్పటినుంచి ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. అటు ఎన్నికల తర్వాత ఎస్పీ కూటమి నుంచి బయటకు వచ్చిన మాయావతి పార్టీ బలోపేతం దిశగా చర్యలు చేపట్టారు.. ఈనేపథ్యంలోనే గత జూన్లో ఆనంద్ కుమార్ బీఎస్పీ ఉపాధ్యక్షుడిగా నియమించారు. ఇది జరిగిన కొద్దిరోజులకే ఐటీ దాడులు జరగడంతో కలకలం రేగుతోంది.. ఉన్నట్టుండి విరుచుకుపడిన ఐటీ శాఖ.. ఆనంద్కుమార్ ఆస్తులపై విచారణ మొదలు పెట్టడంతో బీఎస్పీ వర్గాల్లో కలవరాన్ని కలిగిస్తోంది. బినామీ చట్టాన్ని ఉల్లంఘించిన వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్ష లేదంటే బినామీ ఆస్తి మార్కెట్ విలువలో 25 శాతం వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. మరి, తన సోదరుడి ఆస్తులపై ఐటీ శాఖ యాక్షన్కు మాయావతి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com