ఏపీలో పెట్టుబడులకు పుష్కలమైన అవకాశాలు : సీఎం జగన్

ఏపీలో పెట్టుబడులకు పుష్కలమైన అవకాశాలు ఉన్నాయన్నారు సీఎం జగన్. సుస్థిర ప్రభుత్వం..సుదీర్ఘ తీర ప్రాంతం, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, అపార వనరులు ఏపీ బలమని అన్నారు. అవినీతిరహిత పాలనతో పెట్టుబడిదారులకు భరోసా ఇస్తామని అన్నారు. విదేశాంగ శాఖ సహకారంతో విదేశీ రాయబారులతో అమరావతిలో నిర్వహించిన పరస్పర అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా డిప్లొమాటిక్ అవుట్ రీచ్ పేరిట జరిగిన ఈ సదస్సుకు 35 దేశాల నుంచి దౌత్యవేత్తలు, ప్రతినిధులు హాజరయ్యారు.
పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా జరిగిన డిప్లొమాటిక్ ఔట్ రీచ్ లో ఏపీ బలాలు, బలహీనతలను వివరించారు సీఎం జగన్. హైదరాబాద్, బెంగళూరు లాంటి మెట్రో సిటీలు తమకు లేకున్నా.. పెట్టుబడులకు అనుకూలంగా ఉండే వనరులకు మాత్రం కొదువ లేదన్నారు. విద్యుత్ ఒప్పందాలపై సమీక్షించి పీపీఏలపై తాము తీసుకున్న నిర్ణయం వివాదస్పదం అయ్యిందని అన్నారు. అయినా అవినీతికి తావులేకుండా ప్రభుత్వం పట్ల విశ్వసనీయత పెంచటమే చేయటమే తమ లక్ష్యమని వివరించారు.
జగన్ సీఎం అయ్యాక పెట్టుబడుల కోసం ఇంతమంది దౌత్యవేతలతో సమావేశం కావటం ఇదే తొలిసారి. ఏపీలో పోర్టుల, ఎయిర్ పోర్టుల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను జగన్ వివరించారు. పెట్టుబడులకు మీ సహకారం కావాలంటూ విదేశీ ప్రతినిధులను కోరారు జగన్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com