ఆర్టీసీ విలీనంపై రవాణాశాఖ మంత్రి సంచలన వ్యాఖ్యలు

ఆర్టీసీ విలీనంపై రవాణాశాఖ మంత్రి సంచలన వ్యాఖ్యలు

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం సాధ్యం కాదని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ స్పష్టం చేశారు. ఆర్టీసీ విలీనంపై మేనిఫెస్టోలో హామీ ఇవ్వలేదన్నారు. ప్రజలపై సమ్మెను రుద్దడం సరికాదన్న మంత్రి.. పండగ వేళ ప్రజల్ని గమ్యస్థానాలకు చేర్చడంలో సఫలీకృతం అయ్యామన్నారు. సంప్రదింపుల నుంచి వైదొలగింది కార్మిక సంఘాలేనని ఆరోపించారు. సమ్మె చట్టవిరుద్ధమని ఇప్పటికీ చెబుతున్నాట్లు పేర్కొన్నారు. అక్టోబర్‌ 5 నాటికి విధుల్లో ఉన్నవారే ఆర్టీసీ ఉద్యోగులని పునరుద్ఘాటించారు.

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో విపక్షాలు అసంబద్ధమైన ఆరోపణలు చేస్తున్నాయని మంత్రి పువ్వాడ అజయ్‌ మండిపడ్డారు. బీజేపీ, కమ్యూనిస్టు పాలిత రాష్ట్రాల్లో ఆర్టీసీని విలీనం చేశారా? అని ఆయన ప్రశ్నించారు. విపక్షాల అసంబద్ధ ఆరోపణలపై ప్రజలు ఈసడించుకుంటున్నారన్నారు. ఆర్టీసీకి లక్ష కోట్ల ఆస్తులున్నాయనడం అవాస్తవమని.. రూ. 4 వేల 416 కోట్ల విలువైన ఆస్తులు మాత్రమే ఉన్నాయన్నారు. ఆర్టీసీ ఆస్తుల్ని ధారాదత్తం చేస్తామని చెప్పామా అంటూ పువ్వాడ ప్రశ్నించారు.

ఉమ్మడి రాష్ట్రంలో ఆర్టీసీకి ఏ ప్రభుత్వం సాయం చేయలేదన్నారు మంత్రి పువ్వాడ. తెలంగాణ వచ్చాక ఆర్టీసీకి రూ.3 వేల 303 కోట్ల సాయం చేశామన్నారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకే పండగ వేళ సమ్మెకు దిగారని ఆరోపించారు. ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా మాట్లాడాలన్నారు. రైల్వేలను ప్రైవేటీకరణ చేసిన బీజేపీ.. ఆర్టీసీ ప్రైవేటీకరణపై మాట్లాడుతోందంటూ ఎద్దేవా చేశారు.

Tags

Read MoreRead Less
Next Story