అయోధ్య వివాదంపై ఏకాభిప్రాయంతో సుప్రీంకోర్టు తీర్పు

అయోధ్య వివాదంపై ఏకాభిప్రాయంతో సుప్రీంకోర్టు తీర్పు

ayodhya

అయోధ్యలో వివాదాస్పద స్థలం హిందువులకే చెందుతుందని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అయితే.. కొన్ని కండిషన్లు వర్తిస్తాయని న్యాయస్థానం చెప్పింది. అయోధ్యపై కేంద్రం ఓ ట్రస్టును ఏర్పాటు చేయాలని చెప్పిన ప్రధాన న్యాయమూర్తి.. వివాదాస్పద స్థలాన్ని దానికి అప్పగించాలని తెలిపింది. 3 నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి కావాలని CJI తీర్పు చెప్పారు. మరోవైపు.. ముస్లింలకు మసీదు నిర్మాణానికి 5 ఎకరాల ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.

ఐదుగురు న్యాయమూర్తులు ఏకాభిప్రాయంతో తీర్పు ఇచ్చారు. దాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్‌ చదివారు. బాబ్రీ మసీదు అంతర్లీన నిర్మాణాలు ఇస్లామిక్ సంప్రదాయంలో లేవని చెప్పారాయన. అంతర్గత నిర్మాణాలు కానీ.. కళాఖండాలు కానీ.. ఇస్లామిక్ సంస్కృతిని ప్రతిబింబించడం లేదని CJI స్పష్టంచేశారు. అదే సమయంలో.. బాబ్రీ మసీదును ఖాళీ స్థలంలో నిర్మించలేదని సూటిగా చెప్పారు. అక్కడ మందిరం లాంటి నిర్మాణం లేదని పురావస్తు శాఖ చెప్పలేదని తెలిపారు. మసీదు కింద ఆలయ నిర్మాణం ఉన్నట్టు పురావస్తు శాఖ నిర్ధారణ చేసినట్టు CJI స్పష్టంచేశారు.

అయోధ్యను రాముడు జన్మించిన ప్రదేశంగా హిందువులు నమ్ముతున్నారని సుప్రీంకోర్టు చెప్పింది. అదే సమయంలో నమ్మకాలు, విశ్వాసాల ఆధారంగా తీర్పు చెప్పలేమని తెలిపింది. సహజ న్యాయ సూత్రాలు, ఆధారాల ప్రకారమే భూమి హక్కులు ఉంటాయని స్పష్టంచేసింది. బాబ్రీ మసీదు కింద ఆలయ నిర్మాణం ఉందని పురావస్తు శాఖ నివేదికలో ఉందన్న సుప్రీంకోర్టు.. బాబర్ పాలనా కాలంలో ఆయన సైనికాధికారి బాబ్రీ మసీదు కట్టారని స్పష్టంచేసింది. అయితే.. మందిరాన్ని కూల్చినట్టు నివేదిక లేదన్నారు. 12-16 శాతాబ్దాల మధ్య ఏం జరిగిందో చెప్పడానికి ఆధారాల్లేవని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.

అందరి వాదనలు విన్న తర్వాత అంతిమతీర్పు చెప్తున్నట్టు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ చెప్పారు. షియా వక్ఫ్‌ బోర్డు పిటిషన్‌ను తోసిపుచ్చారు. నిర్మొహి అఖాడా వాదనలు సరైనవి కాదన్నారు.

Tags

Read MoreRead Less
Next Story