ముంచుకొస్తోన్న బుల్బుల్.. గంటకు 120 కి.మీ వేగం
బుల్బుల్ ముంచుకువస్తోంది. గంటకు 120 కి.మీ వేగంతో కూడిన ప్రచండ గాలులతో తీరం వైపుకు దూసుకొస్తోంది. ఇవాళ రాత్రి 10 గంటల లోపు తీరాన్ని తాకే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్పై సైక్లోన్ తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే ఓడిశాను ముంచెత్తుతున్న వర్షాలు బెంగాల్లోనూ కుండ పోతగా కురుస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన కేంద్ర హోంశాఖ కోల్కతాలో విమానాల రాకపోకల్ని నిలిపేసింది. రేపు ఉదయం ఆరు గంటల వరకు విమానాల రాకపోకల్ని రద్దు చేశారు.
రాష్ట్రంలో నెలకొన్న తుపాన్ పరిస్థితుల నేపథ్యంలో పశ్చిమబెంగాల్ సిఎం మమతా బెనర్జీ ట్విట్టర్లో స్పందించారు. తుపాన్ పరిస్థితిపై నిరంతరం సమీక్షించాలని ఆదేశించారు. ప్రజలెవరూ భయభ్రాంతులకు గురి కావొద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. సహాయక చర్యల కోసం ప్రత్యేక కంట్రోలు రూమ్లతోపాటు ఎన్డీఆర్ఎఫ్,ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించినట్లు ఆమె తెలిపారు. మరోవైపు రాష్ట్రంలోని పలుచోట్ల పాఠశాలలు, కళాశాలలతోపాటు అంగన్వాడీ కేంద్రాలు మూతపడ్డాయి. లోతట్టు,తీర ప్రాంతాల్లోని దాదాపు లక్షన్నర మంది ప్రజల్ని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com