నెరవేరనున్న భారత సిక్కు యాత్రికుల దశాబ్దాల కల
భారత సిక్కు యాత్రికుల దశాబ్దాల కల నేరవేరనుంది. కర్తార్పూర్లోని దర్బార్ సాహిబ్ గురుద్వారాను దర్శించుకునేందుకు మార్గం సుగమమైంది. దర్బార్ సాహిబ్ను దర్శించుకునేలా.. 2 దేశాలను కలిపే కర్తార్పూర్ కారిడార్ శనివారం ప్రారంభం కానుంది. పాకిస్థాన్లోని నరోవల్ జిల్లాను.. భారత్లోని డేరాబాబా నానక్ గురుద్వారాతో కలిసేలా ఈ కర్తార్పూర్ను నిర్మించారు. గురుదాస్ పూర్ జిల్లాలోని డేరా బాబా నానక్ సమీపానగల చెక్ పోస్ట్ వద్ద ప్రధాని మోదీ ప్రారంభించి ప్రసంగిస్తారు. అటు పాక్లో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కారిడార్ ను ప్రారంభించనున్నారు.
భారత్ నుంచి ప్రభుత్వం తరపున ప్రత్యేక బృందం కారిడార్ ను సందర్శించనుంది. ఈ సందర్భంగా 500 మందితో కూడిన మొదటి యాత్రికుల బృందం‘జాతా’కు జెండా ఊపుతారు. మొదటి బృందంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్, మాజీ సీఎం ప్రకాశ్సింగ్ బాదల్, నవ్జ్యోత్ సింగ్ సిద్ధూతోపాటు పంజాబ్కు చెందిన 117 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు. భారత్- పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న పరిస్థితుల్లో.. కార్తార్పూర్ కారిడార్ ప్రారంభోత్సం కొంత ఉద్రిక్తతలను తగ్గించనుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
కర్తార్ పూర్ లో గురునానక్ దేవ్ నిర్మించిన గురుద్వారా సిక్కులకు పవిత్ర ప్రదేశం. దేశ విభజన వల్ల పాకిస్థాన్ పరిధిలోకి వెళ్లిపోయిన ఆ సాహిబ్.. మన దేశంలోని గురుదాస్ పూర్ జిల్లాకు 4కిలో మీటర్ల దూరంలో ఉంది. దేశ విభజన వల్ల 1947లో భారత యాత్రికులు ఈ ప్రదేశానికి రాకుండా పాకిస్థాన్ ప్రభుత్వం రోడ్డు క్లోజ్ చేసింది. దీంతో బోర్డర్ వద్దకు వెళ్లి టెలిస్కోప్ తో చూడాల్సి వచ్చేది. ఈ మార్గంలో కారిడార్ నిర్మాణానికి గత ఏడాది నవంబర్ 26న వైస్ ప్రెసిడెంట్ వెంకయ్యనాయుడు శంకుస్థాపన చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com