యువతి కోసం వెతుక్కుంటూ వెళ్లి.. పాక్ పోలీసులకు చిక్కిన విశాఖ వాసి..
పాకిస్థాన్లో తెలుగువ్యక్తి ప్రశాంత్ను పోలీసులు అరెస్ట్ చేశారు. పాస్పోర్టు, వీసా లేకుండా కొలిస్తాన్ ఎడారిలో ప్రవేశించేందుకు యత్నించారని ప్రశాంత్తో పాటు మధ్యప్రదేశ్కు చెందిన మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. ప్రశాంత్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తున్నారు. ప్రశాంత్ను బహవల్పూర్ దగ్గర పాక్ పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. దీంతో ప్రశాంత్ కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రశాంత్ను విడిపించడానికి చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ప్రశాంత్ది విశాఖపట్నం అని తెలంగాణ పోలీసులు చెప్తున్నారు.
ప్రశాంత్కు ఆన్లైన్లో పరిచయం అయిన ఓ యువతి కోసం వెతుక్కుంటూ.. గూగుల్ మ్యాప్ ఆధారంగా పాకిస్థాన్ భూభాగంలోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. అతడు తెలుగులో మాట్లాడిన ఓ వీడియో సైతం పాక్ వెబ్సైట్లలో చక్కర్లు కొడుతోంది. వీరిద్దరూ ఆ దేశంలో ఉగ్రదాడులకు కుట్రపన్నారనే అభియోగాలు పాకిస్థాన్ మీడియాలో ప్రసారమవుతున్నాయి.
ప్రశాంత్ స్వస్థలం విశాఖపట్నం అని గుర్తించినట్లు తెలంగాణ పోలీసులు చెబుతున్నారు. అతడు రెండేళ్ల క్రితమే పాక్ భూభాగంలోకి అడుగు పెట్టాడని తెలిపారు. ప్రేమ విఫలమవ్వడంతో మతిస్థిమితం కోల్పోయిన ప్రశాంత్.. అటూఇటూ తిరుగుతూ.. ఎడారి మార్గంలో పాకిస్థాన్కు వెళ్లాడని వివరించారు. అప్పుడే అతడిని అక్కడి పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com