మందు బాబులూ.. ఇకపై పెగ్ వెయ్యాలంటే..
ఖజానా ఖాళీ అయిపోతోంది. నింపాలంటే మద్యం బాబులు చెయ్యి వెయ్యాల్సింది. ఫుల్గా మీరు మందుకొడితేనా నిల్ బ్యాలెన్స్లో ఉన్న ఖాతా ఫుల్లవుతుంది అని తెలంగాణా సర్కారు పధకం రచిస్తోంది. ఆదాయ అన్వేషణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ముగ్గురు మంత్రులతో కూడిన కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయనుంది. మద్యం ధరలను నిర్ధారించే బాధ్యతను వారికి అప్పగించింది ప్రభుత్వం. ఈ కమిటీ సిఫారసుల మేరకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని సమచారం. కమిటీ ఇప్పటికే ధరలను 5 నుంచి 10 శాతం మేరకు పెంచే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వీటిని ఆమోదిస్తే ఏటా రూ.1200 నుంచి 1700 కోట్ల మేర ఆదాయ వృద్ధి జరుగుతుందని అంచనా. అయితే మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ను బట్టి మద్యం ధరల సవరణపై నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో పాటు రాజధానిలోనూ సిటీ శివార్లలోనూ నిర్వహించే ఈవెంట్లను వర్గీకరించాలని, ఈవెంట్ల స్థాయిని బట్టి ఫీజును సవరించాలని సర్కారు యోచిస్తోంది. అన్ని మార్గాల్లో వీలైనంత ఎక్కువ ఆదాయాన్ని రాబట్టుకునే ప్రయత్నాలు ప్రారంభించిందని ఎక్సైజ్ వర్గాలు అంటున్నాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com