ఆసక్తికరంగా మారిన పవన్ ఢిల్లీ టూర్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆకస్మికంగా ఢిల్లీకి వెళ్లారు. ఉన్నట్టుండి ఆయన హస్తిన టూర్కు వెళ్లడం ఆసక్తి రేపుతోంది. ఈ పర్యటనలో బీజేపీ పెద్దల్ని కలిసి తెలుగు రాష్ట్రాల పరిస్థితులను వివరిస్తారని సమాచారం. ప్రధానంగా ఇసుక కొరత, భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలపై ఫిర్యాదు చేసేందుకు పవన్ ఢిల్లీ వెళ్లారనే వార్తలు వినిపిస్తున్నాయి. అటు తెలంగాణలో ఆర్టీసీ సమ్మె విషయాన్ని బీజేపీ అగ్రనేతల దృష్టికి తీసుకెళ్తారనే చర్చ జరుగుతోంది. అయితే... పవన్ ఢిల్లీ టూర్పై జనసేన నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేకపోవడంతో ఆయన ఎందుకు ఢిల్లీ వెళ్లారన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది..
ఢిల్లీ వెళ్లే ముందు భవన నిర్మాణ కార్మికుల కోసం మంగళగిరిలో డొక్కా సీతమ్మ పేరుతో ఆహార శిబిరాన్ని ప్రారంభించారు పవన్ కల్యాణ్.. కార్మికులకు స్వయంగా ఆయనే వడ్డించారు. ఈ సందర్భంగా పవన్ వైసీపీ సర్కారుపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వ పాలసీలు సరిగ్గా లేకపోతే ప్రజలను చంపేయడంతో సమానమన్నారు. ఇసుక కొరతతో ప్రభుత్వం 50 మందిని హత్యచేసిందని ఘాటుగా ఆరోపించారు..
మంగళగిరి నుంచి విజయవాడకు చేరుకున్న పవన్... అక్కడినుంచి నేరుగా ఢిల్లీ వెళ్లారు. ప్రస్తుత పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్... ఢిల్లీ పర్యటన రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది. జనసేన నుంచి స్పష్టమైన ప్రకటన లేకపోవడంతో పవన్ ఢిల్లీలో ఎవరెవరిని కలుస్తారు? వారితో ఏం చర్చిస్తారనేది ఆసక్తిగా మారింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com