కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎలాంటి నిధులు రాలేదు - తెరాస ఎంపీలు
తెలంగాణభవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ పార్లమెంటరీ పక్షనేత కే.కేశవరావు అధ్యక్షత టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సభ్యుల సమావేశం సుదీర్ఘంగా జరిగింది. ఈ నెల 18 నుంచి జరగబోయే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలతో చర్చించారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు.. స్థానిక బీజేపీ నేతల విమర్శలు అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని.. పార్లమెంట్ లో బీజేపీతో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశా నిర్దేశం చేశారు కేటీఆర్..
రాష్ట్రం ఏర్పడిన తరువాత కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎలాంటి నిధులు రాలేదని ఎంపీలు అభిప్రాయపడ్డారు. దీంతో ముఖ్యంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పథకాల కోసం ఈ సారి కేంద్రాన్ని గట్టిగా కోరే అంశంపైనే చర్చించారు. తాగునీటి ప్రాజెక్టులకు కేంద్రం నుంచి సాయం కోరాలని.. బయ్యారం స్టీల్ ప్లాంట్తో పాటు 30 అంశాలపై చర్చించారు.. నిధుల విషయంలో పోరాడైనా సాధించుకోవాలని ఎంపీలకు కేటీఆర్ సూచించారు. ఎంపీలంతా అవకాశం వచ్చిన ప్రతిసారి తమ వాయిస్ను గట్టిగా వినిపించాలన్నారు.
రాష్ర్టానికి సంబంధించిన హక్కులపై పార్లమెంట్లో కేంద్రాన్ని నిలదీయనున్నట్లు ఎంపీ నామానాగేశ్వర్రావు చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుకి జాతీయ హోదా వద్దని సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్పై మాత్రం నామా సమాధానం దాటేశారు. దానిపై పార్టీ నిర్ణయం తీసుకుంటుంది అన్నారు.. పార్టీ ఆవిర్భావం నుంచి టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి అధ్యక్షుడి హోదాలో కేసీఆర్ అధ్యక్షత వహించారు. ఇప్పుడు తొలిసారి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షత వహించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com