ఆరు నెలల్లో రాష్ట్రాన్ని విచ్చలవిడిగా దోచుకున్నారు : చంద్రబాబు
రాష్ట్రంలో పార్టీని మళ్లీ పటిష్ట పరిచేందుకు చంద్రబాబు వరుస పర్యటనలు చేస్తున్నారు. తాజాగా కర్నూలు జిల్లాలో మూడు రోజుల పాటు పర్యటించారు. జిల్లా టీడీపీ శ్రేణులకు అధినేత చంద్రబాబు ధైర్యం నూరిపోశారు. వరుసగా మూడు రోజులూ పార్టీ నేతలతో వరుస సమీక్షలు నిర్వహించారు. వైసీపీ దాడులతో ఇబ్బంది పడ్డ కార్యకర్తలకు ధైర్యం చెపుతూనే.. జిల్లాలో టీడీపీ బలోపేతానికి వ్యూహాలు రచించారు. కేడర్కు దిశానిర్దేశం చేశారు.
టీడీపీ కార్యకర్తలు పోలీస్స్టేషన్కు వెళ్లి కేసులు పెడితే తీసుకోవడంలేదని, దాడి చేసిన వాళ్ల ఫిర్యాదుతో తమ పార్టీ నేతల్ని అరెస్ట్ చేస్తున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుడు కేసులతో తమ పార్టీ వారిని బెదిరిస్తున్నారని ఆరోపించారు.
ఆరు నెలల్లో సీఎం జగన్ సాధించిందేమీ లేదని, దాడులు చేస్తూ రాష్ట్రాన్ని విచ్చలవిడిగా దోచుకున్నారని చంద్రబాబు ఆరోపించారు. రాజధాని అనేది ప్రతి రాష్ట్రానికి అవసరంమని.. కానీ మన రాజధాని అమరావతిని మానసికంగా చంపేశారని చంద్రబాబు మండిపడ్డారు.
తాను వెంకటేశ్వర స్వామి విషయంలో సీఎం జగన్ డిక్లరేషన్ ఇవ్వాలని అడిగితే.. వైసీపీ మంత్రులు నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు.. అందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చంద్రబాబు హెచ్చరించారు..
జగన్ పాలనలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందన్నారు. రాష్ట్రానికి అప్పులు కూడా రావడం లేదని, 7 నెలలుగా అభివృద్ధికి ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదని చంద్రబాబు ఆరోపించారు. వచ్చే ఆదాయం 30శాతం పడిపోయిందని చంద్రబాబు విమర్శించారు. కర్నూలు జిల్లాలో మూడు రోజుల పాటు పర్యటించిన చంద్రబాబు.. పార్టీ పటిష్టతపై కేడర్కు దిశా నిర్దేశం చేసి.. వైసీపీ దాడుల బాధితుల్లో ధైర్యం నింపారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com