కుటుంబ సభ్యులకు మృతదేహాలు అప్పగింత
దిశను అతి కిరాతకంగా అత్యాచారం చేసి.. తగులబెట్టిన దుర్మార్గులు.. యాదృశ్చికంగా అదే సమయానికి, అదే ప్రదేశంలో హతమయ్యారు. షాద్నగర్ సమీపంలో చటాన్పల్లి బ్రిడ్జి కింద దిశను నలుగురు రాక్షసులు అత్యంత పాశవికంగా తగులబెట్టారు. సరిగ్గా అదే స్పాట్కు కేవలం అర కిలోమీటర్ దూరంలో వాళ్లంతా శవాలై తేలారు. ఎన్కౌంటర్ జరిగిన సమయం కూడా తెల్లవారు జామున నాలుగున్నర గంటల ప్రాంతం. యాదృచ్ఛికంగా జరిగినా.. ఆ రాక్షసులకు తగినశాస్తి జరిగిందని స్థానికులు, నెటిజన్లు అంటున్నారు..
దిశ హత్య కేసులో నిందితులను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. సీన్ రీ కన్స్ట్రక్షన్ కోసం మొదట తుండుపల్లి టోల్గేట్కు తీసుకొచ్చారు. ఆ తర్వాత వారిని చటాన్పల్లి దగ్గర దిశను తగులబెట్టిన చోటికి తీసుకొచ్చారు. ఆమెను ఎలా తగులబెట్టారో అడిగి తెలుసుకుంటుండగా... నలుగురు నిందితులు ఒక్కసారిగా ఎదురుతిరిగారు. పోలీసులపై దాడి చేసి వారి ఆయుధాలు లాక్కున్నారు. రాళ్ల దాడి చేస్తూ సమీపంలోని పొలాల్లోకి పరుగు తీశారు. నిందితుల దాడిలో నందిగామ ఎస్.ఐ వెంకటేశ్వర్లు తో పాటు మరో కానిస్టేబుల్ అరవింద్కు తీవ్ర గాయాలయ్యాయి. ఇక లొంగిపోవాలంటూ పలుమార్లు హెచ్చరించినా నిందితులు దాడి కొనసాగించడంతో.. ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపారు. దీంతో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు.... నిందితుల కాల్పుల్లో గాయపడిన పోలీసులను హైదరాబాద్ కేర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు..
తెల్లవారుజామున 5.45 నుంచి 6.15 నిమిషాల మధ్య ఎన్ కౌంటర్ జరగగా.. ఉదయం 7 గంటల ప్రాంతంలో సమాచారం బయటికొచ్చింది.. ఆ తర్వాత నలుగురు ఎమ్మార్వోలు, రెవెన్యూ సిబ్బందిని పిలిచి పంచనామా జరిపించారు. ఘటన జరిగిన క్రమం.. నిందితుల డెడ్బాడీస్ పడి ఉన్న విధానం.. అక్కడి భౌగోళిక పరిస్థితులు ఇలా ప్రతి ఒక్క అంశాన్ని వారు పద్ధతి ప్రకారం నోట్ చేశారు. అనంతరం క్లూస్ టీమ్ సభ్యులు వచ్చి సాంకేతిక ఆధారాలు సేకరించారు. నిందితుల చేతుల్లోంచి ఆయుధాలను, 12 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు..
పంచనామా ప్రక్రియ, ఆధారాల సేకరణ పూర్తి కాగానే.. నలుగురు నిందితుల మృతదేహాలను ఆటోల్లో మహబూబ్నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడే వారి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు.. పోస్టుమార్టం ప్రక్రియను వీడియో తీశారు.. అనంతరం వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com