కుటుంబ సమేతంగా వేములవాడ రాజన్నను దర్శించుకున్న సీఎం కేసీఆర్
రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్.. కుటుంబ సమేతంగా వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు. రాజరాజేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా రాజన్నను దర్శించుకోవడం ఇదే తొలిసారి. కేసీఆర్కు వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వేములవాడ క్షేత్రాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని గతంలో సీఎం ప్రకటించారు. దీనిలో భాగంగా అక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించనున్నారు.
అంతకుముందు కాళేశ్వరం పథకంతో ఎత్తిపోసిన గోదావరి జలాలతో నిండుకుండలా మారిన మిడ్ మానేరు జలాశయాన్ని ముఖ్యమంత్రి పరిశీలించారు. మానేరు నదిలో కాళేశ్వరం జలాలకు సీఎం కేసీఆర్ పూజలు చేశారు. తంగళ్లపల్లి వంతెనపై మానేరు నదికి కేసీఆర్ జలహారతి ఇచ్చారు.
రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి తిరిగి కరీంనగర్ జిల్లాలోని తీగలగుట్టపల్లిలోని కేసీఆర్ భవన్కు చేరుకుని.. స్థానిక నేతలతో మాట్లాడనున్నారు. ఈ టూర్లో సీఎం కేసీఆర్ వెంట మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com