మున్సిపల్ ఎన్నికలు : అభ్యర్థుల లిస్ట్ను ఇంకా ఫైనలైజ్ చేయని బీజేపీ
పుర పోరులో బీజేపీ సత్తా చాటాలని చూస్తోంది. గత నాలుగు నెలలుగా ప్రజల మధ్యే ఉంటూ నేతలు పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారు. రాష్ట్ర స్థాయి నేతల నుంచి మండల, గ్రామ స్థాయి వరకు అంతా గత నాలుగైదు నెలల నుండి విస్తృతంగా పర్యటనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ప్రజల్లో బీజేపీపై అంచనాలు పెరిగాయని నేతలు భావిస్తున్నారు. దీంతో మున్సిపల్స్లో కచ్చితంగా సత్తా చాటుతామన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఐతే.. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఇప్పటి వరకు బీజేపీ నేతలు ప్రిపేర్ చేయలేక పోయారు. ఆశావహులు చివరి నిమిషం వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. మొదటి నుంచి మున్సిపల్ ఎన్నికలపై సస్పెన్స్ కూడా కొంత ఇబ్బందికి గురి చేసింది. అయితే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పోటీకి సిద్దమని ప్రకటించిన బీజేపీ నేతలు... నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనా అభ్యర్థుల లిస్ట్ను చాలా ప్రాంతాల్లో ఫైనలైజ్ చేయలేదు. దీంతో అభ్యర్దులను వీలైనంత త్వరగా ఖరారు చేసేందుకు బీజేపీ నాయకత్వం సిద్దమైంది. బుధవారం సాయంత్రంలోపే ఆశావహుల లిస్ట్ ఇవ్వాలంటూ జిల్లా అధ్యక్షులను ఆదేశించింది. ఏ వార్డుకైనా ఒక్కరే ఉంటే వారికి నేరుగా నామినేషన్ ఇవ్వాలని పార్టీ భావిస్తోంది. పోటీ అధికంగా ఉంటే క్లస్టర్ ఇన్ఛార్జ్లు అభ్యర్దుల ఎంపిక బాధ్యతను తీసుకోనున్నారు.
గత కొంత కాలంగా మున్సిపాల్టీల్లో, గ్రామాల్లో పార్టీ కార్యక్రమాలు పెరగడంతో చేరికలు కూడా ఎక్కువయ్యాయి. దీంతో మున్సిపాల్టీ ఎన్నికల్లో పోటీ చేసే ఆశావహుల సంఖ్య పెరిగిందంటున్నారు నేతలు. కొత్త.. పాత కలయికతో ఈ ఎన్నికల్లో పోటీకి దిగబోతున్నామని.. ఫలితాలు కచ్చితంగా తమకు అనుకూలంగా వస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక కోసం మున్సిపాల్టీల వారిగా కసరత్తులు చేస్తున్న రాష్ట్ర నాయకత్వం... క్లస్టర్ ఇన్ఛార్జ్లకు ఆ బాధ్యతలను అప్పగించింది. మొదట ఎనిమిది మందితో కూడిన కమిటీ ఆశావహులను ఫిల్టర్ చేసి.. క్లస్టర్ ఇన్ఛార్జ్లకు అప్పగిస్తే .. వారు ఫైనల్గా ఎవరికి బరిలోకి దింపాలో నిర్ణయించనుంది. దీంతో నామినేషన్ల చివరి రోజు వరకు ఆశావాహుల్లో టెన్షన్ తప్పేలా లేదు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com