గోదావరి జిల్లాల్లోకి ఫ్యాక్షన్ రాజకీయాల్ని తీసుకొస్తే ప్రజలు క్షమించరు: పవన్

కాకినాడ లాంటి ఘటన మళ్లీ జరిగితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. తమ సహనాన్ని చేతకాని తనంగా భావించొద్దని చెప్పారు. రెచ్చగొట్టాలి, శాంతిభద్రతల సమస్యల్ని సృష్టించాలని అనుకుంటే ఎవరూ ఉండరంటూ ఫైర్ అయ్యారు. పండగ సమయంలో లేని గొడవలు సృష్టించారని మండిపడ్డారు. ప్రశాంతమైన గోదావరి జిల్లాల్లోకి ఫ్యాక్షన్ రాజకీయాల్ని తీసుకొస్తే ప్రజలు క్షమించరని అన్నారు పవన్.
జనసేనపై జరిగిన దాడి ఘటనను పోలీసులు సుమోటోగా తీసుకోవాలని డిమాండ్ చేశారు పవన్. దాడి చేసిన వారితోపాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపైనా చర్యలు తీసుకోవాలన్నారు. వైసీపీ దాడిపై గవర్నర్కు కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పారు పవన్. రాష్ట్రంలో జరుగుతున్నపరిణామాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు పవన్. పాలన ఒకేచోట ఉండాలని.. అభివృద్ధి మాత్రం అన్ని ప్రాంతాలకు విస్తరించాలని అన్నారు. రెండురోజుల్లో విజయవాడలో కీలక సమావేశం నిర్వహిస్తున్నామని చెప్పారు పవన్.
అంతకుముందు పవన్ బసచేసిన హోటల్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. జనసైనికులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. విశాఖ నుంచి రోడ్డు మార్గంలో కాకినాడ చేరుకున్నపవన్ స్థానిక జనసేన నేత పంతం నానాజీ ఇంటికి వెళ్లారు. అక్కడ గాయపడిన నేతలు, కార్యకర్తలను పరామర్శించారు. ఆ తర్వాత.. జనసేన నేతల సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com