కరోనా బాధితులకు వైద్యం.. కారులోనే డాక్టర్ నివాసం

కరోనా బాధితులకు వైద్యం.. కారులోనే డాక్టర్ నివాసం

కుటుంబం హ్యాపీగా ఉండాలంటే నేను కారులోనే ఉండాలి అని అందులోనే తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు మధ్యప్రదేశ్ భోపాల్‌కి చెందిన డాక్టర్ సచిన్ నాయక్. ఆయన స్థానిక జేపీ ఆసుపత్రిలో కరోనా వైరస్ బాధితులకు సేవలు అందిస్తున్నారు. వారం రోజుల నుంచి సచిన్ ఇంటికి వెళ్లకుండా ఆసుపత్రి ఆవరణలోనే కారుని పార్క్ చేసుకుని అందులోనే ఉంటున్నారు.

పని వేళలు అయిపోయిన తరువాత భార్యా పిల్లలతో మాట్లాడుతూ, పుస్తకాలు చదువుతూ గడిపేస్తున్నారు. వైరస్ బాధితులకు సేవలందిస్తున్నందున, కుటుంబసభ్యులకు వైరస్ సోకకుండా ముందు జాగ్రత్త చర్యగా ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నానని ఆయన తెలిపారు. సచిన్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అది చూసిన మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ డాక్టర్ సచిన్‌ని ప్రశంసించారు.

వైద్యులు, ఇతర సిబ్బంది తమ ప్రాణాలను ఫణంగా పెట్టి వైరస్ బాధితులకు సేవలందిస్తున్నారని వారి సేవలను ఆయన కొనియాడారు. కరోనా మహమ్మారిపై యుద్ధం చేసే యోధులు మీరు.. మీకు నా ధన్యవాదాలు.. మీ స్ఫూర్తికి వందనం అని ముఖ్యమంత్రి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తి మున్ముందు కొనసాగాలని ఆకాంక్షించారు. కాగా, మధ్యప్రదేశ్‌లో కరోనా మరణాల సంఖ్య 16కు చేరుకుంది. బుధవారం నాటికి రాష్ట్రం మొత్తంలో 229 మంది కరోనా వైరస్ బారి పడిన పడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story