కరోనా కంటే దారుణం 'అంఫన్'.. నీట మునిగిన ఎయిర్పోర్ట్: సీఎం
అంఫన్ తుఫాను తాకిడికి పశ్చిమ బెంగాల్ చిగురాటుకులా వణికిపోతోంది. తుఫాన్ తీవ్ర రూపం దాల్చడంతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించింది. ఇప్పటి వరకు 72 మంది మరణించారని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. మృతి చెందిన కుటుంబాలకు రూ.2.5 లక్షల పరిహారం అందజేస్తామని తెలిపారు. కోలకతా విమానాశ్రయం నీట మునిగింది. బలమైన గాలులు, భారీ వర్షాల కారణంగా కోల్కతా ఎయిర్పోర్ట్ నీటితో నిండిపోయింది. దీంతో భారీ నష్టాన్ని చవిచూడాల్సి వస్తోంది. గంటకు 120 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి.
విమానాశ్రయం లోని అన్ని కార్యకలాపాలు ఈ రోజు తెల్లవారుజామున 5 గంటలకు మూసివేశారు. కరోనా వైరస్ కారణంగా మార్చి 25 నుంచి విమాన రాకపోకలను నిలిపి వేశారు. ప్రస్తుతం కార్గో విమానాలు మాత్రమే నడుస్తున్నాయి. బుధవారం మధ్యాహ్నం అంఫన్ తుఫాను 2.30 గంటల సమయంలో బెంగాల్పైకి దూసుకెళ్లింది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో చెట్లు, భవనాలు, విద్యుత్ తీగలు నేల మట్టమయ్యాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తుఫాను సమయంలో తన కార్యాలయంలోనే ఉన్నారు. కరోనా వైరస్ కంటే దారుణంగా అంఫన్ తుఫాన్ తీవ్రత ఉందని ముఖ్యమంత్రి అన్నారు. తుఫాను కారణంగా లక్ష కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ఆమె అన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com