రైలెక్కుతున్నారా.. జర జాగ్రత్తన్నా.. ఇవి గుర్తుంచుకోండి..
ఏమంటా కరోనా వచ్చిందో కానీ.. ఎక్కడి పనులక్కడ.. ఎక్కడి ప్రయాణాలక్కడ ఆగిపోయాయి.. ఎక్కడి వారక్కడ నిలిచి పోయారు.. జూన్ 1 నుంచి రైలు బండి పట్టాలెక్కనుంది. ఇంతకు ముందులానే ఉంటామంటే కుదరదు.. అలాగే చేస్తాము.. అడిగేవారెవరుంటారో చూస్తాము అంటే కరోనా వచ్చి మిమ్మల్ని ఇంటికి పంపించకుండా క్వారంటైన్కి పంపిస్తుంది. అందుకే ప్రభుత్వం చెప్పినట్లు రైల్వే శాఖ జారీ చేసిన గైడ్లైన్స్ని అందరూ కచ్చితంగా పాటించాలి. మరి అవేంటో ఒకసారి చూద్దాం.. మనతో పాటు మన పక్కవారూ చేసేలా చూస్తూ ప్రభుత్వానికి సహకరిద్దాం..
ప్రయాణీకులందరికీ తప్పనిసరిగా కరోనా పరీక్ష నిర్వహిస్తుంది రైల్వేశాఖ. వైరస్ లక్షణాలు లేని ప్రయాణీకులను మాత్రమే రైలు ఎక్కడానికి అనుమతిస్తారు. రైళ్లలో ప్రయాణించే ప్రయాణీకులు ఈ క్రింది జాగ్రత్తలు పాటించాలి.
టిక్కెట్లు ఉన్న ప్రయాణీకులను మాత్రమే రైల్వే స్టేషన్లోకి అనుమతించాలి. ప్రయాణీకులందరూ స్టేషన్లోకి వెళ్లేముందు, ప్రయాణం చేసేముందు కచ్చితంగా మాస్కులు ధరించాలి.
స్టేషన్లో థర్మల్ స్క్రీనింగ్ నిర్వహిస్తారు. అందుకోసం కనీసం 90 నిమిషాలు ముందుగానే స్టేషన్కు చేరుకోవాలి.
ప్రయాణీకులు స్టేషన్ వద్ద, రైలు ఎక్కేటప్పుడు, ట్రెయిన్ కూర్చున్నప్పుడు సామాజిక దూరాన్ని పాటించాలి.
వారి గమ్యస్థానాలకు చేరుకున్నప్పుడు ప్రయాణీకులు రాష్ట్ర ప్రభుత్వం సూచించిన ఆరోగ్య ప్రోటోకాల్కు కట్టుబడి ఉండాలి.
కరోనా వైరస్ లక్షణాలు ఉంటే, టిక్కెట్లు ధృవీకరించబడినప్పటికీ అతడిని/ఆమెని ప్రయాణించడానికి అనుమతించరు. అటువంటప్పుడు ప్రయాణీకుల టిక్కెట్ డబ్బులు పూర్తి వాపస్ వారికి అందజేయబడుతుంది.
రైళ్లలో ప్రీ పెయిడ్ భోజన బుకింగ్, ఇ-క్యాటరింగ్ నిలిపివేయబడుతుంది. టిక్కెట్ బుక్ చేసుకునే సమయంలోనే ప్రయాణీకులకు ఈ సమాచారం అందుబాటులో ఉంటుంది.
ప్రయాణీకులు తమ సొంత ఆహారం, వాటర్ బాటిల్ తీసుకువెళ్లడానికి అనుమతి ఉంది.
రైలు లోపల ఎటువంటి దుప్పట్లు ఇవ్వకూడదు. ప్రయాణీకులు ఎవరి దుప్పట్లు వారే తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ప్రయాణీకుల సౌకర్యార్థం వారి ప్రయోజనం ఏసీ కోచ్ల్లోని ఉష్ణోగ్రత తగిన విధంగా నియంత్రించబడుతుంది.
ప్రయాణీకులందరూ ఆరోగ్య సేతు యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఉండాలి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com