టాప్‌టెన్‌లో భారత్.. గత నాలుగు రోజులుగా పెరుగుతున్న కేసుల సంఖ్య

టాప్‌టెన్‌లో భారత్.. గత నాలుగు రోజులుగా పెరుగుతున్న కేసుల సంఖ్య

లాక్డౌన్ విధించి కరోనా కేసుల్ని కట్టడి చేయగలిగిన భారత్.. ఈ నెలాఖరు వరకు లాక్డౌన్ ఉన్నా సడలింపుల్లో భాగంగా వేల సంఖ్యలో జనం రోడ్ల మీదకు వస్తున్నారు. దాంతో గత నాలుగు రోజులుగా దేశంలో రోజుకి 6 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 6977 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో ఈ స్థాయిలో నమోదు కావడం ఇదే మొదటి సారి. దీంతో దేశంలో కరోన బాధితుల సంఖ్య 1,38,845కి చేరుకుంది. నిన్నఒక్కరోజే కోవిడ్‌తో మృతి చెందిన వారి సంఖ్య 154కు చేరుకుంది. సోమవారం ఉదయానికి దేశంలో కోవిడ్తో మరణించిన వారి సంఖ్య 4021కి చేరుకుందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది.

దేశంలో కరోనా వైరస్ సోకిన బాధితుల్లో ఇప్పటి వరకు 57,721 మంది కోలుకోగా మరో 77,103 మంది చికిత్స పొందుతున్నారని తెలిపింది. ఈ నెల 12వ తేదీ వరకు 70 వేల పాజిటివ్ కేసులు ఉండగా ఆ సంఖ్య నేటికి లక్షా 38 వేలకు చేరింది. మహారాష్ట్రలో కోవిడ్ విశ్వరూపం చూపిస్తోంది. ఇప్పటి వరకు అక్కడ 50 వేల పాజిటివ్ కేసులు నమోదు కాగా మృతుల సంఖ్య 1635కి చేరింది. మహారాష్ట్ర తరువాతి స్థానంలో తమిళనాడు కొనసాగుతోంది. అక్కడ పాజిటివ్ కేసుల సంఖ్య 16,277 కి చేరుకోగా 111 మంది మత్యువాత పడ్డారు. ఇక మూడో స్థానంలో గుజరాత్ ఉంది. ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు 14,056 పాజిటివ్ కేసులు నమోదు కాగా 858 మంది మృత్యువాత పడ్డారు. దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే మొత్తం కేసుల సంఖ్య 13,418 చేరగా ఇప్పటి వరకు 261 మంది మృత్యువాత పడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story