వ్యాక్సిన్ అందరికీ ఉచితంగా.. : నోబెల్ గ్రహీతలు
ప్రపంచమంతా మహమ్మారి కోరల్లో చిక్కుకుంది. బయట పడే మార్గం కోసం అన్వేషిస్తోంది. వ్యాక్సిన్ వస్తే వైరస్ వ్యాప్తిని కట్టడి చేయవచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాక్సిన్ ఎంత త్వరగా వస్తే అంత త్వరగా పేద, ధనిక తేడాలేకుండా అందరికీ ఉచితంగా అందించాలని 18 మంది నోబెల్ గ్రహీతలతో సహా వంద మంది ప్రముఖులు విజ్ఞప్తి చేశారు. కరోనా మహమ్మరి బలహీనులు, బలవంతులు అనే తేడా లేకుండా అందరినీ కబళిస్తోంది. ఆయా దేశాలు ప్రజల ఆరోగ్యం పై ఎంత శ్రద్ధ పెట్టారనేది ఈ వైరస్ తో తేట తెల్లమవుతుందని ప్రముఖులు అభిప్రాయపడ్డారు. రానున్న వ్యాక్సిన్ ఎంత వరకు విజయవంతం అవుతుంది.. ఎంత మేరకు అందరికీ అందుబాటులో ఉంటుందనే విషయం ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చింది.
ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తికి, ప్రపంచ వ్యాప్త ఉచిత సరఫరాకు ముందుకు రావల్సిందిగా ప్రభుత్వాలు, అంతర్జాతీయ సంస్థలు, దాతలు, సేవాసంస్థలను కోరుతున్నాం. ఎటువంటి భేదభావం లేకుండా అందరికి వ్యాక్సిన్ ఉచితంగా సరఫరా చేయడం మనందరి సామాజిక బాధ్యతగా గుర్తించాలి అని నోబెల్ బృందం పేర్కొంది. బంగ్లాదేశ్ కు చెందిన నోబెల్ స్వీకర్త మొహమ్మద్ యూనస్ స్థాపించిన ఓ స్వచ్ఛంద సంస్థ ఈ మేరకు ఓ లేఖను విడుదల చేసింది. ఆయన ఆలోచనకు మద్దతు తెలుపుతూ నోబెల్ గ్రహీత మాలాలా యూసఫ్ జాయ్, రష్యా మాజీ అధ్యక్షుడు మైఖేల్ గోర్బచెవ్, హాలీవుడ్ నటుడు జార్జిక్లూని, దక్షిణాఫ్రికాకు చెందిన మతబోధకుడు ఆర్చ్ బిషప్ డెస్మండ్ టుటు తదితరులు సంతకాలు చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com