పరిస్థితి ఇలాగే ఉంటే రోజుకి 'లక్ష' కేసులు: అమెరికా వైద్య నిపుణుడు ఆంటోనీ ఫౌచీ

పరిస్థితి ఇలాగే ఉంటే రోజుకి లక్ష కేసులు: అమెరికా వైద్య నిపుణుడు ఆంటోనీ ఫౌచీ

అగ్ర రాజ్యం అమెరికాపై కరోనా కోరలు చాస్తూనే ఉంది. కేసులు తగ్గు ముఖం పట్టే జాడలు కనిపించడం లేదని ప్రముఖ వైద్యుడు ఆంటోనీ ఫౌచీ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం లేదని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. వైరస్ వ్యాప్తి నివారణకు ప్రాధమిక చర్యలైన మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటివి చేయడం లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. పరిస్థితి ఇలాగే ఉంటే ప్రస్తుతం రోజుకి 40వేల కేసులు నమోదవుతున్న ఈ సంఖ్య లక్షకు చేరుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదని ఫౌచీ అన్నారు.

ప్రభుత్వ మార్గ దర్శకాలను ప్రజలు ఏ మాత్రం పాటించడం లేదని అన్నారు. ఈ మహమ్మారి పూర్తిగా కనుమరుగయ్యేలోపు ఎన్ని మరణాలు సంభవిస్తాయో చెప్పలేమని అన్నారు. ఊహించుకుంటేనే తీవ్ర ఆవేదన కలుగుతుందని అన్నారు. మహమ్మారిని కట్టడి చేయాలంటే మాస్కులు తప్పనిసరిగా ధరించాలని ఫౌచీతో పాటు అమెరికా 'వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం' (సీడీసీ) సంచాలకుడు డా. రాబర్ట్ రెడ్ ఫీల్డ్ వెల్లడించారు. ప్రతి ఒక్కరూ వైరస్ వ్యాప్తిని నిరోధించడాన్ని వ్యక్తిగత బాధ్యతగా స్వీకరించాలని కోరారు.

Tags

Read MoreRead Less
Next Story