బ్రేకింగ్.. గ్యాంగ్స్టర్ వికాస్ దూబే అరెస్ట్!
ఎనిమిది మంది పోలీసులను చంపి దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ వికాస్ దూబే అరెస్టు అయ్యాడు. మధ్యప్రదేశ్లోని ఉజ్జెయినిలో వికాస్ దూబేను పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. ఉజ్జెయినిలో మహాకాళేశ్వరుడికి పూజలు నిర్వహించేందుకు వికాస్ అక్కడకు వెళ్లినట్లు తెలుస్తోంది. మహాకాళేశ్వరుడి ఆలయంలో పనిచేస్తున్న ఓ గార్డు అతన్ని నిర్బంధించినట్లు తెలుస్తోంది.
వికాస్ను పట్టుకున్న ఆలయ గార్డు.. ఆ విషయాన్ని ఉజ్జెయిన్ ఎస్పీ మనోజ్ సింగ్కు తెలియజేశాడు. ఆ తర్వాత ఉజ్జెయిని పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్కు ఆ రాష్ట్ర డీజీపీ ఈ విషయాన్ని తెలియజేశారు. యూపీకి చెందిన గ్యాంగ్స్టర్ వికాస్ దూబే తలపై రూ. 5 లక్షల రివార్డు ఉంది.
కాన్పూర్లోని చౌబేపూర్ ప్రాంతంలో జూలై 3న గ్యాంగ్స్టార్ వికాస్ దూబేను అదుపులోకి తీసుకొనేందుకు ప్రయత్నించిన పోలీసులపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో డీఎస్పీ సహా మొత్తం 8 మంది పోలీసులు నేలకొరిగారు. బిక్రూ గ్రామంలో జరిగిన ఈ ఉదంతం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. అప్పటి నుంచి వికాస్ దూబే పోలీసుల కళ్లుగప్పి తప్పించుకు తిరుగుతున్నాడు. ఇప్పటికే ఈ కేసుతో లింకు ఉన్న నలుగురు క్రిమినల్స్ను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com