ఆటోలో తిరుగుతున్న గ్యాంగ్స్టర్ వికాస్ దూబే!
ఎనిమిది మంది పోలీసులను చంపి దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గ్యాంగ్స్టార్ వికాస్ దూబే నోయిడాలో ప్రత్యక్షమయ్యాడు. బుధవారం రాత్రి నోయిడాలో ఆటోలో వెళ్తూ తనకు కన్పించాడని ఓ పాసింజర్ పోలీసులకు సమాచారం అందించాడు. గ్రేటర్ నోయిడాలోని ఎక్కుర్తి గోల్చక్కర్ నుంచి నోయిడాలోని సెక్టార్ 71 వరకు తాను ఆటోలో వచ్చానని ఆ ప్రాయణికుడు పోలీసులకు వివరించాడు. ఆ ఆటోలో వికాస్ దూబే కూడా ఉన్నాడని పోలీసులకు తెలిపాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు గ్యాంగ్స్టార్ కోసం గాలింపు చేపట్టారు. సమాచారం అందించిన వ్యక్తిని పోలీసులు విచారిస్తున్నారు.
కాన్పూర్లోని చౌబేపూర్ ప్రాంతంలో జూలై 3న గ్యాంగ్స్టార్ వికాస్ దూబేను అదుపులోకి తీసుకొనేందుకు ప్రయత్నించిన పోలీసులపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో డీఎస్పీ సహా మొత్తం 8 మంది పోలీసులు నేలకొరిగారు. బిక్రూ గ్రామంలో జరిగిన ఈ ఉదంతం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
అప్పటి నుంచి వికాస్ దూబే పోలీసుల కళ్లుగప్పి తప్పించుకు తిరుగుతున్నాడు. బుధవారం ఢిల్లీలో కనిపించినట్లు సమాచారం అందడంతో అక్కడి పోలీసులను అధికారులు అప్రమత్తం చేశారు. నజాఫ్గఢ్ ప్రాంతంలో అతడు తిరుగుతున్నట్లు తెలియడంతో ఆ ప్రాంతాన్ని పోలీసులు జల్లడపట్టారు. అయినా అతని ఆచూకీ లభించలేదు. అయితే వికాస్ దుబేకు సంబంధించి సమాచారం అందించిన వారికి రూ.5 లక్షలు ఇస్తామని యూపీ సర్కార్ బుధవారం ప్రకటించింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com