POLAVARAM: పోలవరంపై జగన్‌ సర్కార్‌కు మరో ఎదురుదెబ్బ

POLAVARAM: పోలవరంపై జగన్‌ సర్కార్‌కు మరో ఎదురుదెబ్బ
ఖర్చు చేసిన రూ. 984 కోట్ల ఇవ్వబోమన్న ప్రాజెక్ట్‌ అథారిటీ...

పోలవరం ప్రాజెక్టుపై జగన్‌ ప్రభుత్వం ఖర్చుచేసిన నిధుల్లో 984.44 కోట్లను ఇవ్వబోమని ప్రాజెక్టు అథారిటీ తిరస్కరించింది. కేంద్రం అనుమతించిన పరిమితులను దాటి నిర్మాణాలు చేపట్టినందున అదనంగా చేసిన వ్యయాన్ని ఇచ్చేది లేదని పోలవరం అథారిటీ స్పష్టం చేసింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి నిధుల విషయంలో జగన్‌ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన వాటిలో ప్రధాన డ్యాం పనుల్లో 314.79 కోట్లు, ఎడమ కాలువ పనుల్లో 329.08 కోట్లు, కుడి కాలువలో 190.28 కోట్లు... అధికారుల, ఉద్యోగుల జీతాల్లో 100.41 కోట్లు, భూసేకరణలో 49.55 కోట్లు.. ఇలా మరికొన్ని నిధులు ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. ప్రాజెక్టు నిర్మాణానికే ఈ నిధులను వెచ్చించినందున ఆ మొత్తం ఇవ్వాలని ఏపీ అధికారులు కేంద్ర జలశక్తి అధికారులను కోరారు. ప్రస్తుతం కేంద్రం నుంచి రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు అంశంలో ఒక వెయ్యి 511.85 కోట్లు రావాల్సి ఉంది. ఇందులో 238.78 కోట్ల బిల్లులు ఇచ్చేందుకు పోలవరం అథారిటీ కేంద్రానికి సిఫారసు చేసింది. మరో 288.63 కోట్ల భూసేకరణ, పునరావాసం చెల్లింపుల బిల్లులు... పోలవరం అథారిటీ పరిశీలనలో ఉన్నాయి. ఇవికాక తాజాగా 984.44 కోట్లు మాత్రం ఇచ్చేది లేదని స్పష్టం చేసింది.


ప్రధాన డ్యాంలో భాగంగా ఏపీ అధికారులు సమర్పించిన 314.79 కోట్ల బిల్లులును అథారిటీ తిరస్కరించింది. ఇందులో విద్యుత్‌ కేంద్రం మట్టి తవ్వకాలకు 201.47 కోట్లు ఇవ్వబోమని తేల్చిచెప్పింది. విద్యుత్తు, కేంద్రం ధరల పెంపునకు సంబంధించి 2022 ఫిబ్రవరి బిల్లుల నుంచి అదనపు మొత్తాలు 81.37 కోట్లు కూడా ఇచ్చేది లేదంది. ప్రధాన డ్యాంను కుడి, ఎడమ కాలువలతో అనుసంధానించే పనుల్లో అనుమతించిన పరిమితులను దాటి నిర్మాణాలు చేపట్టిన మొత్తాలు 8.59 కోట్లు కూడా ఇవ్వమని తెలిపింది. ఇవికాకుండా మరికొంత మొత్తమూ మినహాయించింది. పోలవరం ఎడమ, కుడి కాలువల్లో కేంద్రం అనుమతించిన పరిమితులను దాటి నిర్మాణాలు చేపట్టినందున అదనంగా చేసిన వ్యయాన్ని ఇచ్చేది లేదని పోలవరం అథారిటీ తిరస్కరించింది. పట్టిసీమ ఎత్తిపోతల నిర్మాణంలో భాగంగా కుడి కాలువపై తాత్కాలికంగా నిర్మించిన కట్టడాలకు 71.37 కోట్లు కూడా ఇచ్చేది లేదని తేల్చిచెప్పింది. భూసేకరణకు సంబంధించి 49.55 కోట్లు ఇవ్వబోమని పేర్కొంది. ఇవి కాకుండా పోలవరంలో ఉద్యోగులు, ఇంజినీర్ల జీతాలు, ఇతర నిర్వహణ ఖర్చులు కూడా M.H.001 హెడ్‌ కింద బిల్లులు పోలవరం అథారిటీకి సమర్పించారు. మొత్తం 100.73 కోట్ల మొత్తాన్ని ఈ కేటగిరీలో తిరస్కరించారు. ప్రతిపాదించిన మొత్తంలో 75శాతమే పరిగణనలోకి తీసుకుని మిగిలిన మొత్తాలు తిరస్కరించినట్లు పోలవరం అథారిటీ పేర్కొంది. ఇక్కడ ఇంజినీర్లు, ఇతర సిబ్బంది పోలవరం ప్రాజెక్టులోనే కాకుండా ఇతర ప్రాజెక్టుల్లోనూ సేవలు అందిస్తున్నందున ఆ మేరకు బిల్లులు తిరస్కరిస్తున్నట్లు పోలవరం అథారిటీ తేల్చిచెప్పింది.

Tags

Read MoreRead Less
Next Story