YCP: వైసీపీ పాలనలో ముంచుకొస్తున్న ముప్పు

YCP: వైసీపీ పాలనలో ముంచుకొస్తున్న ముప్పు
విత్తన దశ నుంచే విపత్తు... విచ్చలవిడిగా రసాయన మందుల పిచికారీ

వైసీపీ పాలనలో విత్తన దశ నుంచే విపత్తు ముంచుకొస్తోంది. చీడపీడల ఉద్ధృతితో విచ్చలవిడిగా రసాయన మందుల వినియోగించాల్సి వస్తోంది. మూల రసాయన పిచికారి 2వేల టన్నులకు పైగా చేరుకుంది. దేశవ్యాప్తంగా రసాయన పురుగుమందుల వినియోగం తగ్గుతుంటే ఆంధ్రప్రదేశ్‌లో భారీగా పెరుగుతోంది. రసాయన మందుల నాణ్యత పరీక్షల్లోనూ మమ అనిపిస్తున్నారు. ఫలితాలు వచ్చే సరికే.. రైతుల జేబులు ఖాళీ అవుతున్నాయి. రైతు భరోసా కేంద్రాల వేదికగా రైతన్నలకు అండగా నిలుస్తున్నామని.... ముఖ్యమంత్రి జగన్‌ తరచూ బాకా లూదుతుంటారు. కానీ ఆ మార్పులు మాటలకే పరిమితమయ్యాయని క్షేత్రస్థాయి పరిస్థితులు తేటతెల్లం చేస్తున్నాయి. నాణ్యతలేని పురుగుమందులు వ్యవసాయ క్షేత్రాల్ని ముంచెత్తుతున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో తెగుళ్ల నివారణకు పురుగుమందుల పిచికారీ ఖర్చు పెరిగి సాగు భారం రెట్టింపవుతోంది. పైగా ఈ రసాయనాల పురుగుమందులు నాణ్యత లేకపోయినప్పటికీ...... ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది.

దేశవ్యాప్తంగా రసాయన మందుల వాడకం తగ్గుతుంటే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం టన్నుల కొద్దీ పొలాల్లో పోయాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. 2019-20తో పోలిస్తే.. 2022-23కి రసాయన మందుల వాడకం 28శాతం పెరిగింది. 2వేల టన్నుల మూల రసాయనాలను పిచికారి చేశారు. నాలుగేళ్లలో మూల రసాయన వాడకం 442 టన్నులు పెరిగింది. బయో ఉత్పత్తుల వినియోగం 10 టన్నుల నుంచి ఏకంగా 51 టన్నులకు చేరింది. ఈ ఉత్పత్తుల పేరుతో రైతుల నుంచి దోపిడీ కూడా భారీగానే ఉంటోంది. అనంతపురం జిల్లాలో ఇటీవల విచ్చలవిడి బయో ఉత్పత్తుల అమ్మకాలపై ఆ శాఖ ఉన్నతాధికారులే ఆగ్రహం వ్యక్తం చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. రసాయన మందుల నమూనాల సేకరణ కూడా మొక్కుబడిగానే సాగుతోంది. లక్ష్యంలో 70శాతం కూడా తీయడం లేదు. ఖరీఫ్‌లో 10 వేల 500 పురుగుమందుల నమూనాల్లో 5వేల లోపే సేకరించారు. ఫలితాలు వచ్చినవి కూడా 3వేల 200 మాత్రమే. అందులో సుమారు 40 వరకు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేవని నిర్ధరించారు. ఏదైనా ఒక ఉత్పత్తి... నాణ్యత లేదని గుర్తించే లోపే మార్కెట్లో వాటికి సంబంధించిన బ్యాచ్‌ నంబర్ల అమ్మకాలు పూర్తవుతున్నాయి.

ఉమ్మడి కర్నూలు, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో పెద్దఎత్తున నాణ్యత లేని పురుగుమందుల్ని పట్టుకున్నారు. అయినా చర్యలు మాత్రం శూన్యమే. 213 కోట్లతో వ్యవసాయ ల్యాబ్‌లంటూ ఆర్భాటం చేసిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి.. అక్కడా వెంటనే పరీక్షలు చేసే విధానం అందుబాటులోకి తీసుకురాలేదు.

Tags

Read MoreRead Less
Next Story