EC: వైసీపీకి కొమ్ముకాస్తున్న అధికారులపై వేటు!

EC: వైసీపీకి కొమ్ముకాస్తున్న అధికారులపై వేటు!
కొందరు కలెక్టర్లు, ఎస్పీలపై వేటు పడే అవకాశం... కేంద్ర ఎన్నికల సంఘానికి సమగ్ర నివేదిక

ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీకి కొమ్ముకాస్తున్న కొందరు కలెక్టర్లు, SPలపై వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనీసం ఏడుగురు జిల్లా కలెక్టర్లు, 14 మంది ఎస్పీలు, కమిషనర్లపై ఎన్నికల సంఘానికి సమగ్ర నివేదిక వెళ్లినట్టు తెలుస్తోంది. ప్రధాని సభలో... భద్రతా వైఫల్యానికి పల్నాడు, ప్రకాశం జిల్లాల SPలు మూల్యం చెల్లించుకోక తప్పదనే వాదన వినిపిస్తోంది. ఏపీలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినా తీరుమారని.. కొందరు వైసీపీ అనుకూల ఉన్నతాధికారులపై చర్యలకు రంగం సిద్ధమౌతోంది. జిల్లా ఎన్నికల అధికారులుగా వ్యవహరిస్తున్న ఏడుగులు కలెక్టర్లు, 14 మంది ఎస్పీలు, సీపీలపైనా ఎన్నికల సంఘం వేటు వేసే అవకాశాలున్నాయి. గతం నుంచే EC ఆయా అధికారుల వ్యవహారశైలిపై ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ మేరకు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం నుంచి నివేదిక తెప్పించుకున్న కేంద్ర ఎన్నికల సంఘం సదరు అధికారులపై కొరడా ఝళిపించే అవకాశాలున్నాయి.

గుంటూరు, తూర్పుగోదావరి, చిత్తూరు, తిరుపతి తదితర జిల్లాల కలెక్టర్లు..అధికార పార్టీ అగ్రనేతలతో అంటకాగుతున్నారని ఎప్పట్నుంచో ఫిర్యాదులు వచ్చాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక కూడా వారు తీరుమార్చుకోకుండా కొందరు పోటీపడి స్వామి భక్తి చాటుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. గుంటూరు, పల్నాడు, ప్రకాశం, విజయవాడ జిల్లాల ఎస్పీలతోపాటు.. నగర పోలీస్‌ కమిషనర్‌ సైతం వైసీపీకి అనుకూలంగా ఉన్నారంటూ ప్రతిపక్షాలు కూడా నేరుగా ఈసీకి ఫిర్యాదు చేశాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణలో ఈ అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించగలరా అని ఈసీ సంశయిస్తోంది.. ఎన్నికల కోడ్ అమల్లో కఠినంగా వ్యవహరించాలని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన విషయాన్నీ..కొందరు కలెక్టర్లు వైసీపీ పెద్దలకు చేరవేసినట్టు సమాచారం. కొందరు జిల్లా కలెక్టర్లు ఓ ముందడుగేసి, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ప్రభుత్వానికి అనుకూలంగా లేరని సీఎంకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఆరా తీస్తున్నాయి.

మరోవైపు.. పల్నాడు జిల్లా బొప్పూడి వద్ద ఇటీవల ప్రధాని మోదీ పాల్గొన్న ప్రజాగళం సభలో పోలీసుల నిర్లక్ష్యాన్నీ ఈసీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. లౌడ్ స్పీకర్లు, లైట్లు ఏర్పాటు చేసిన స్టాండ్‌పైకి ఎక్కిన కార్యకర్తల్ని కిందకు దిగాలని స్వయంగా మోదీ కోరినప్పుడూ పోలీసులు ఆ దిశగా కదల్లేదని కేంద్ర నిఘా వర్గాలు నివేదిక ఇచ్చినట్టు తెలుస్తోంది. పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, ప్రకాశం జిల్లాSP పరమేశ్వర్ రెడ్డి, నెల్లూరు జిల్లా Spతిరుమలేశ్వరరెడ్డి, సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి ప్రధాని సభకు ఇంఛార్జులుగా వ్యవహరించారు. వీరు అధికార పార్టీకి అనుకూలంగా వీరు వ్యవహరిస్తున్నట్టు.. ఈసీ కూడా నివేదిక పంపినట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story