7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం.. రెండ్రోజులపాటు భారీ వర్షాలు

7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం.. రెండ్రోజులపాటు భారీ వర్షాలు

ఏపీలో కురుస్తోన్న భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రధానంగా అనంతపురం, కడప జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనంతపురం జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పెనుగొండలో అత్యధిత వర్షపాతం నమోదైంది. పెనుగొండ మండలంలోని దుద్దే బండ - పెనుగొండ రహదారిలో బ్రిడ్జి కూలిపోవడంతో... రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాల కారణంగా అనేక చెరువుల నిండి జలకళను సంతరించుకుంటున్నాయి.

అనంతపురం జిల్లా ధర్మవరంలో కురిసిన భారీ వర్షాలకు... ఇళ్లలోకి నీళ్లు చేరాయి. పట్టణంలోని దుర్గానగర్‌, పార్ధసారధినగర్‌, జోగిని గుంట, ఇందిరమ్మకాలనీలు జలమయం అయ్యాయి. మగ్గం గుంతల్లోకి భారీగా నీరు చేరడంతో.. నేతన్నలు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు నేత కార్మికులు. గొల్లపల్లి వంక, పోతుల నాగేపల్లి వంక, మోటువార్ల వంకలు పొంగి పొర్లుతున్నాయి. కళ్యాణదుర్గం మండలంలో 10 సెంటీమీర్లు, ధర్మవరంలో 9.4, అనంతపురం నగరంలో 6.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

ఇక కడప జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. చక్రాయపేట మండల కేంద్రంలో భారీ వర్షం కురిసింది. దీంతో కొండవాండ్లపల్లి గ్రామంలో భారీగా నీరు చేరింది. పీతురు వంక, అరవంక ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత పదేళ్లుగా ఈ రెండు వంకలు ఎప్పుడు పారలేదంటున్నారు గ్రామస్థులు. భారీ వర్షాల కారణంగా.. పంటలు నీటమునిగాయి. పాపాఘ్ననది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.

హైదరాబాద్ నగరాన్ని వర్షం ముంచెత్తింది. నగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిస్తుంది. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.. చార్మినార్‌, కోటి, పంజాగుట్ట, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, హైటెక్‌ సిటీ, కూకట్‌ పల్లి, మియాపూర్‌ ప్రాంతాల్లో జోరువాన కురిసింది. రోడ్లపై మోకాళ్ల లోతు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మరోవైపు పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తాలో 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. కోస్తాలోని ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. తెలంగాణలోనూ రెండ్రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఇటీవల కురుస్తున్న వర్షాలతో నిజామాబాద్‌ జిల్లాలోని వాగులు వంకలు జలకళ సంతరించుకున్నాయి. ప్రధాన జలాశయాల్లోకి నీటి ప్రవాహం పెరుగుతోంది. వరదనీటితో పోచారం, రామడుగు ప్రాజెక్టులు నిండుకుండలుగా మారాయి. ఇక గ్రామాల్లోని అనేక చెరువులు చెక్‌డ్యామ్‌లు అలుగులు పొంగి ప్రవహిస్తూ.. జలపాతాలను తలపిస్తున్నాయి. సుందరమైన జలదృశ్యాలను చూసేందుకు జనం పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story