AP: ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ

AP: ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ
డీఎస్సీ ద్వారా 6,100 పోస్టుల భర్తీకి మంత్రివర్గం పచ్చజెండా... బోధనేతర సిబ్బంది ఉద్యోగ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం...

ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ ద్వారా 6,100 పోస్టుల భర్తీకి మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. టెట్‌ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 16న నాలుగో విడత చేయూత పథకంలో భాగంగా 5వేల కోట్ల ఆర్థిక సాయం అందించేందుకు కేబినేట్‌ ఆమోదం తెలిపింది. సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ అధ్యక్షతన సమావేశమైన రాష్ర్ట మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. 6,100 డీఎస్సీ పోస్టుల భర్తీకి కేబినేట్‌ పచ్చజెండా ఊపింది. పాఠశాల విద్యాశాఖలో ఇతర ఖాళీలను పదోన్నతి, బదిలీల ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించింది. అన్ని విశ్వవిద్యాలయాల్లోని బోధనేతర సిబ్బంది ఉద్యోగ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అటవీ రక్షణలో భాగంగా 689 పోస్టుల భర్తీ సహా ఏపీ పబ్లిక్‌ సర్వీసులు నియామక, నియంత్రణ చట్ట సవరణను ఆమోదించింది. 13వేల171 గ్రామ పంచాయతీల్లో గ్రేడ్-5 కార్యదర్శుల నియామకానికి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఫిబ్రవరి 16న 26.98 లక్షల మంది మహిళలకు చేయూత నాలుగో విడత కింద 5వేల కోట్ల ఆర్థిక సాయం ఇచ్చేందుకు కేబినేట్‌ అంగీకరించినట్లు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ వెల్లడించారు.


ముఖ్యమంత్రి కుటుంబ భద్రతకు ఏర్పాటు చేసే స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్‌లో 25 మంది హెడ్‌ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి మంత్రివర్గం అంగీకరించింది. డిస్కంలకు 1500 కోట్ల రుణం తీసుకునేందుకు బ్యాంకు హామీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదం పొందిన గ్రీన్ కో, జిందాల్ నియో ఎనర్జీ సహా వివిధ సంస్థలకు సౌర పవన విద్యుత్ ప్రాజెక్టులో భాగంగా భూకేటాయింపులకు కేబినెట్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అప్పర్ సీలేరు వద్ద హైడ్రో ఎలక్ట్రిక్ పంప్‌డ్ స్టోరేజ్ ప్రాజెక్టు ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. సహజ వాయువుపై పన్నును 24 నుంచి 5 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏపీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లెజిస్లేచర్‌ స్టడీస్‌ అండ్‌ ట్రైనింగ్‌ సంస్థ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. డిజిటల్ ఇన్‌ఫ్రా కంపెనీ రద్దుకు అంగీకరించింది. అసైన్డ్‌ భూముల మార్పిడి నిషేధ చట్ట సవరణ బిల్లుకు కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది.

Tags

Read MoreRead Less
Next Story