LOKESH: వెళ్లిపోయిన పరిశ్రమలను తిరిగి వెనక్కి తెస్తాం

LOKESH: వెళ్లిపోయిన పరిశ్రమలను తిరిగి వెనక్కి తెస్తాం
యువత సొంత రాష్ట్రంలోనే ఉద్యోగం చేసుకునేలా చర్యలు తీసుకుంటామన్న నారా లోకేశ్‌... మంగళగిరిలో బ్రాహ్మణి ప్రచారం

ఆంధ్రప్రదేశ్‌ నుంచి వెళ్లిపోయిన పరిశ్రమలను తిరిగి వెనక్కు తీసుకొస్తామని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకోశ్ స్పష్టం చేశారు. అన్నమయ్య జిల్లా రాజంపేట యువగళం సభలో యువతతో ఆయన ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. యువత పక్క రాష్ట్రాల వైపు చూడకుండా...సొంత రాష్ట్రంలోనే ఉద్యోగం వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని లోకేశ్ భరోసా ఇచ్చారు. ‘ఒక్క అవకాశం’ అనే మాటకు 2019లో అందరూ పడిపోయారని జగన్‌పై లోకేశ్ విమర్శలు గుప్పించారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలో 2.30 లక్షల ఉద్యోగాలు ఇస్తానంటూ యువతను జగన్ మభ్యపెట్టారని ధ్వజమెత్తారు. ఒక్క ఉద్యోగమైనా ఇప్పించారా అని ప్రశ్నించారు. ఇక 25 మంది ఎంపీలను ఇస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పిన జగన్ రాష్ట్రాన్ని పట్టించుకోలేదని ఆరోపించారు. ఆ పార్టీకి 22 మంది ఎంపీలు, 9 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారని, కానీ ఏనాడూ పార్లమెంటులో వాళ్లు ఏపీ గురించి మాట్లాడలేదని విమర్శించారు. 2019 ఎన్నికల్లో అన్ని స్థానాల్లో వైసీపీని గెలిపించారని, కానీ ఒక్క పరిశ్రమనైనా జిల్లాకు తీసుకొచ్చారా? ఒక్కరికైనా ఉద్యోగం కల్పించారా? అని లోకేశ్ ప్రశ్నించారు.


తమ ప్రభుత్వ హయాంలో రూ.12-15 లక్షల కోట్ల ఒప్పందాలను కుదుర్చుకున్నామని లోకేశ్‌ తెలిపారు. 35 లక్షల మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగాలు కల్పించేందుకు ఒప్పందాలు చేసుకున్నామని గుర్తు చేశారు. దాంట్లో భాగంగానే కియా మోటార్స్ వచ్చిందని. అందులో 50 వేల మంది పనిచేస్తున్నారన్నారు. హెచ్‌సీఎల్ కంపెనీ వచ్చిందని... అందులో 2 వేల మంది పని చేస్తున్నారని లోకేశ్ తెలిపారు. ఈ విధంగా 44 వేల పరిశ్రమలు తీసుకొచ్చి 6 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధిని తెలుగుదేశం పార్టీ కల్పించిందన్న లోకేశ్‌... కడపలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామన్నారు. రూ.100 కోట్లతో ఒంటిమిట్ట దేవాలయాన్ని తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేసింది. గండికోటను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాం. కడప దర్గాను కూడా అభివృద్ది చేశామని నారా లోకేశ్ అన్నారు.


వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని... నారా లోకేష్‌ సతీమణి బ్రాహ్మణి ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో బ్రాహ్మణి విస్తృతంగా పర్యటించారు. తాడేపల్లిలోని ఓ వస్త్ర దుకాణంలో మహిళలతో సమావేశమై... కాసేపు ముచ్చటించారు. అనంతరం మంగళగిరిలో నిర్వహించిన స్త్రీశక్తి లబ్ధిదారులతో బ్రాహ్మణి భేటీ అయ్యారు. మహిళలకు రక్షణ, యువతకు ఉపాధి.... చంద్రబాబుతోనే సాధ్యమని బ్రాహ్మణి తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story