నీటితో కళకళలాడుతున్న ప్రాజెక్టులు
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన జలశయాలకు వరద ప్రవాహం కొనసాగుతోంది. పెద్ద ఎత్తున వరద నీరు డ్యాంలోకి వస్తుండడంతో లక్షాలాది క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్, తుంగభద్ర ప్రాజక్టులు నీటితో కళకళలాడుతున్నాయి. శ్రీశైలం జలాశయానికి వరద అంతకంతకూ పెరుగుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి ఇన్ ఫ్లో భారీగా ఉండడంతో 10 గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది. ప్రస్తుతం కృష్ణా బేసిన్ జూరాల నుంచి 7 లక్షల 68 వేల క్యూసెక్కులు, తుంగభద్ర బేసిన్ సుంకేసుల నుంచి 2 లక్షల 19 వేల క్యూసెక్కుల నీరు శ్రీశైలం డ్యాంలోకి వచ్చి చేరుతోంది. దీంతో 10 గేట్లు 42 అడుగుల మేర ఎత్తి.. 8 లక్షల 73 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 215 టీఎంసీలు కాగా.. 183 టీఎంసీల నీటిని నిల్వ ఉంచుతున్నారు..
నాగార్జునసాగర్కు కూడా వరద నీరు ఉధృతంగా వస్తోంది. మొత్తం 26 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 8 లక్షల క్యూసెక్కులకుపైగా నమోదు కాగా.. ఔట్ ఫ్లో 5 లక్షల 78 వేల 90 క్యూసెక్కులుగా ఉంది. అటు తుంగభద్ర జలాశయానికి వరద గంట గంటకు పెరుగుతోంది. ఇన్ఫ్లో 2 లక్షల 34 వేల 743 క్యూసెక్కులు ఉంటే.. ఔట్ఫ్లో 1 లక్ష 21 వేల 932 క్యూసెక్కులుగా ఉంది. ఇక టీబీ డ్యాం నుంచి రెండు లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని దిగువకు విడుదల చేయడంతో... సుంకేసుల రిజర్వాయర్కు పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతోంది. దీంతో.. సుంకేసుల రిజర్వాయర్ 26 గేట్లు ఎత్తి దిగువన ఉన్న శ్రీశైలం డ్యాంకు నీటిని మళ్లిస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com