BABU: చంద్రబాబు బెయిల్‌పై ఉత్కంఠ

BABU: చంద్రబాబు బెయిల్‌పై ఉత్కంఠ
నేడు సుప్రీంకోర్టులో క్యాష్‌ పిటిషన్‌పై విచారణ... ఏసీబీ కోర్టులో బెయిల్‌, కస్టడీ పిటిషన్లపై తీర్పు...

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసుకు సంబంధించి నేడు సుప్రీంకోర్టులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై జరిగే విచారణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అదే సమయంలో చంద్రబాబు బెయిల్‌, కస్టడీ పిటిషన్‌లపై తీర్పు రిజర్వ్‌ చేసిన విజయవాడ ఏసీబీ కోర్టు నేడు వెల్లడించనుంది. హైకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్లపైనా నేడు తీర్పులు వెలువడనున్నాయి. అక్రమంగా తనపై పెట్టిన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసును కొట్టేయాలని కోరుతూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ సుప్రీంకోర్టు ముందు నేడు విచారణకు రానుంది. జస్టిస్‌ అనిరుద్ధబోస్‌, జస్టిస్‌ బేలా ఎం.త్రివేది ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టనుంది. ఈ నెల 3న దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం హైకోర్టు ముందు దాఖలుచేసిన పత్రాలను తమకు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను నేటికి వాయిదా వేసింది.


నేడు సుప్రీంకోర్టులో ఈ కేసు 59వ ఐటం కింద విచారణకు రానుంది. గతంలో ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాదులు హరీష్‌సాల్వే, అభిషేక్‌ మను సింఘ్వీ, సిద్ధార్థ లూథ్రా.... ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరఫున ముకుల్‌ రోహత్గీ, రంజిత్‌కుమార్‌ వాదనలు వినిపించారు. 2018 జులైలో అవినీతి నిరోధక చట్టంలో కొత్తగా చేర్చిన 17ఎ సెక్షన్‌ను అనుసరించి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులపై కేసు నమోదు చేసేటప్పుడు గవర్నర్‌ నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి అని చంద్రబాబు తరఫు న్యాయవాదులు తెలిపారు. 2021 సెప్టెంబరు 7న స్కిల్‌ సంస్థ ఎండీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీఐడీ పోలీసులు డిసెంబరు 9న కేసు నమోదు చేశారని, అందువల్ల దీనికి గవర్నర్‌ ముందస్తు అనుమతి తప్పనిసరి అని వాదించారు. అయితే ఈ కేసు విచారణ 2018లో 17ఎ సెక్షన్‌ రాకముందే ప్రారంభమైనందున గవర్నర్‌ అనుమతి అవసరం లేదని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాదించారు. ఏపీ హైకోర్టు కూడా తన తీర్పులో ఇదే విషయాన్ని చెప్పిందన్నారు. అయితే ధర్మాసనం ఆ పత్రాలను తమకు సమర్పించాలని చెబుతూ కేసును వాయిదా వేసింది.

ఏపీ ప్రభుత్వ అధికారులు పత్రాలు సమర్పించారు. చంద్రబాబు తరఫు న్యాయవాదులూ అదనపు పత్రాలు సమర్పిస్తూ ఐఏ దాఖలు చేశారు. చంద్రబాబు అరెస్టై నెల రోజులు పూర్తైన నేపథ్యంలో ప్రస్తుతం అందరి దృష్టి నేడు సుప్రీంకోర్టు ఇవ్వబోయే ఆదేశాలపైనే ఉంది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌, పోలీసు కస్టడీ కోరుతూ సీఐడీ వేసిన పిటిషన్‌పైనా ఏసీబీ కోర్టు నిర్ణయం ప్రకటించనుంది.చంద్రబాబుపై నమోదు చేసిన ఇన్నర్‌ రింగ్‌రోడ్డు, అంగళ్లు, ఫైబర్‌నెట్‌ కేసుల్లో బెయిల్‌ పిటిషన్‌లపై నేడు హైకోర్టు తీర్పులు ఇవ్వనుంది.

Tags

Read MoreRead Less
Next Story