YuvaGalam Padaytra: లోకేష్ యువగళం పాదయాత్ర

దాదాపు రెండున్నర నెలల తర్వాత ప్రారంభం

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రను పునప్రారంభించారు. రాజోలు నియోజకవర్గం పొదలాడ నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. లోకేష్ కు మద్దతుగా పాదయాత్రలో పాల్గొనేందుకు పెద్దఎత్తున తెలుగుదేశం నేతలు క్యాంపు సైట్ వద్దకు వచ్చారు. పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, అన్ని నియోజకవర్గాల ఇంఛార్జ్ లు మద్దతు తెలిపారు. జనసేన నాయకులు యువగళం పాదయాత్రకు పెద్దఎత్తున స్వాగత ఏర్పాట్లు చేశారు. కాసేపట్లో తాటిపాక సెంటర్ లో లోకేష్ బహిరంగసభ నిర్వహించనున్నారు. పి.గన్నవరం నియోజకవర్గంలో గెయిల్, ONGCబాధితులతో ముఖాముఖి, మామిడికుదురులో స్థానికులతో లోకేష్ సమావేశమవుతారు. పాశర్లపూడి, అప్పనపల్లి మీదుగా అమలాపురం నియోజకవర్గంలోకి పాదయాత్ర కొనసాగనుంది. సాయంత్రం బోడసకుర్రులో మత్స్యకారులతో ముఖాముఖి, పేరూరులో రజక సామాజికవర్గీయులతో భేటీ అవుతారు. రాత్రికి పేరూరు శివారులో లోకేష్ బస చేయనున్నారు.

జగన్ ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడుతున్నారనటానికి యువగళం పున:ప్రారంభం సందర్భంగా వచ్చిన ప్రజాస్పందనే నిదర్శనమని తెలుగుదేశం-జనసేన నేతలు స్పష్టం చేశారు. రాష్ట్రం జగన్ ను ఎందుకు ధ్వేషిస్తోందో ప్రజలు వందలాది సంఘటనలు చెబుతున్నారని నేతలు తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలుగుదేశం-జనసేన కూటమి విజయం తథ్యమని ధీమా వ్యక్తంచేశారు.


తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ యువగళం పాదయాత్రకు మద్దతుగా వివిధ ప్రాంతాల నుంచి అభిమానులు, పార్టీ నేతలు యాత్రలో పాల్గొంటున్నారు. కోనసీమ జిల్లా అంబాజీపేట నుంచి తెదేపా, జనసేన నేతలు తరలివెళ్లారు. వెంకటరాజు ఆయిల్‌ మిల్‌ నుంచి బైక్‌ ర్యాలీ చేపట్టారు. తర్వాత రాజోలు ప్రాంతానికి బయలుదేరి వెళ్లారు. పి.గన్నవరం, అమలాపురం నియోజకవర్గాల్లో యువగళం పాదయాత్రను విజయవంతం చేయాలని ఇరుపార్టీల నేతలు నిర్ణయించారు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం నుంచి తెదేపా, జనసేన శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లాయి. దెందులూరు, పెదవేగి, పెదపాడు, ఏలూరు గ్రామీణ మండలాలకు చెందిన నాయకులు కార్యకర్తలు కార్లలో రాజోలు బయలుదేరారు.

తూర్పుగోదావరి జిల్లా నుంచి తెలుగుదేశం శ్రేణులు పెద్ద సంఖ్యలో పొదలాడకు తరలివెళ్లాయి. నిడదవోలు మాజీ MLA బూరుగుపల్లి శేషారావు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బయలుదేరారు. 100 బైకులు, 100 కార్లతో పొదలాడకు పయనమయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు మాజీ M.L.A. ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో నారా లోకేష్‌కు సంఘీభావం తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story