AP: వైసీపీ అరాచకానికి పరాకాష్ట

AP: వైసీపీ అరాచకానికి పరాకాష్ట
నీళ్లు అడిగిందని మహిళను ట్రాక్టర్‌ తొక్కించి చంపారు.... పల్నాడు జిల్లా రెంటచింతలలో దారుణం

ఆంధ్రప్రదేశ్‌లో మరో దారుణం జరిగింది. గ్రామానికి వచ్చిన ట్యాంకర్ నుంచి మంచినీళ్లు పట్టుకోటానికి వెళ్లటమే ఆమె చేసిన పాపమైంది. నీళ్లు ఇవ్వకుండా టాక్టర్ వెళ్తుంటే నిలదీయడంతో గిరిజన మహిళను ట్రాక్టర్‌తో తొక్కించి చంపారు. తాగునీరు అడిగినందుకే వైసీపీ కార్యకర్త ట్రాక్టర్‌తో ఢీకొట్టి చంపేశారని బాధితులు చెబుతున్నారు. పల్నాడు జిల్లా రెంటచింతల మండలం మల్లవరం గ్రామంలో జరిగిన ఈ ఘటన వైసీపీ నేతల దాష్టీకానికి, అరాచకానికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచింది. తాగునీటి కోసం వచ్చిన గిరిజన మహిళను ట్రాక్టర్‌తో తొక్కించి చంపిన ఘటన పల్నాడు జిల్లాలో కలకలం రేపింది. రెంటచింతల మండలం మల్లవరం గ్రామంలో తాగునీటి సమస్య ఉంది. ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నారు.


నీళ్లు పట్టుకోవటానికి బాణావత్ సామిని అనే 50ఏళ్ల మహిళ ట్యాంకర్ వద్దకు వెళ్లారు. అయితే తెలుగుదేశం వాళ్లకు నీళ్లిచ్చేది లేదంటూ వైసీపీకి చెందిన ట్రాక్టర్ డ్రైవర్‌ మణికంఠ వాహనాన్ని ముందుకు పోనిచ్చారు. ట్రాక్టర్‌కు అడ్డుగా నిలిచిన సామిని ట్యాంకర్ వచ్చింది ప్రజలందరి కోసమే కదా అని ప్రశ్నించారు. మంచినీళ్లు ఇవ్వాలని నిలదీయడంతో మణికంఠ ఆమెను బూతులు తిడుతూ వాహనాన్ని ముందుకు పోనిచ్చాడు. ట్రాక్టర్ ముందువైపు బంపర్ ఆమె పొట్ట భాగం వద్ద గట్టిగా తగిలింది. వెనుకవైపు గోడ ఉండటంతో ఆమె తప్పించుకునేందుకు వీలు లేకుండా పోయింది. ట్రాక్టర్‌తో తొక్కించటంతో సామి తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే బంధువులు ఆమెను మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు.


మహిళ భర్త సక్రియా నాయక్, కుమారుడు బాలు నాయక్ ఇద్దరూ దివ్యాంగులు. సామిని కూలీ పనులకు వెళ్లి వారిని పోషించేది. ఆమె మృతితో ఇప్పుడు వారిద్దరి పరిస్థితి దయనీయంగా మారింది. సామిని కుటుంబంతో మణికంఠకు గతంలో విభేదాలున్నాయి. మంచినీటి కోసం నిలదీసినప్పుడు కోపంతో ట్రాక్టర్ మీదకు ఎక్కించారనే ఆరోపణలున్నాయి. తాగునీరు అడిగితే చంపేస్తారా అని సామిని కుటుంబసభ్యులు వైకాపా నేతల్ని ప్రశ్నిస్తున్నారు. సామిని హత్య విషయం తెలుసుకున్న మాచర్ల టీడీపీ ఇన్‌ఛార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి ఈ ఘటనపై ఆగ్రహం వెలిబుచ్చారు. మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. హత్య కేసు నమోదు చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు. హత్య చేసిన వైసీపీ కార్యకర్తను తక్షణమే అరెస్ట్ చేయాలన్నారు. లేకపోతే బాధితులతో కలసి ఆందోళన చేస్తామని హెచ్చరించారు.దారుణంగా ప్రాణాలు తీయడమే కాకుండా స్థానిక వైసీపీ నాయకులు మాట్లాడిన మాటలు తమను మరింత కుంగదీశాయని బ్రహ్మారెడ్డి ఎదుట బాధిత కుటుంబసభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story