ys Jagan: ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ సర్కార్ సవతి ప్రేమ

ys Jagan: ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ సర్కార్ సవతి ప్రేమ
ఎన్నికలకు ముందు సకాలంలో సేవలు

అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ప్రభుత్వ ఉద్యోగుల్ని అనేక రకాలుగా వేధించిన జగన్‌ ప్రభుత్వం పోలింగ్‌ తేదీ దగ్గర పడేసరికి వారిపై ఎక్కడ లేని ప్రేమ కురిపిస్తోంది. ప్రభుత్వంపై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉండటంతో సీఎం జగన్‌ భయపడుతున్నట్లు కనిపిస్తోంది. వారిని బుజ్జగించడానికే ఇప్పటికే సరెండర్‌ లీవ్‌ల బకాయిలు చెల్లించిన ప్రభుత్వం.....తాజాగా ఒకటో తేదీనే జీతాలివ్వడం లాంటి తాయిలాలతో ఉద్యోగులకు ఎరవేస్తోంది.

ఎన్నికల వేళ రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు జగన్‌ ప్రభుత్వం సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. బుధవారం ఉదయం నుంచే సెల్‌ఫోన్‌కి వస్తున్న మెసేజ్‌లు చూసి ఉద్యోగులు ఉలిక్కిపడ్డారు. కాసేపటికి తేరుకుని.. ఇది ఎన్నికల సమయం అన్న విషయం గుర్తుతెచ్చుకుని స్థిమితపడ్డారు. ప్రతి నెలా ఏ ఐదారు తేదీల్లోనో.. కొన్ని నెలల్లో పన్నెండు, పదమూడో తేదీల్లోనూ జీతాలు తీసుకోవడానికి అలవాటు పడిపోయిన ఉద్యోగులు.. ఒకటో తేదీనే జీతాలు వచ్చేసరికి ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరైపోయారు. ఎప్పట్నుంచో పెండింగ్‌లో ఉన్న సరెండర్‌ లీవ్‌’ల బకాయిలను ఇటీవలే విడుదల చేయడంతో ఇప్పటికే కొంత షాక్‌లో ఉన్న ఉద్యోగులకు......ఇప్పుడు ఒకటో తేదీనే జీతాలు వేసి ప్రభుత్వం మరో షాకిచ్చింది. బుధవారం కార్మిక దినోత్సవం సందర్భంగా బ్యాంకులకు సెలవు ఐనప్పటికీ జీతాలు చెల్లించడంపై ఉద్యోగులు ఆశ్చర్యానికి గురయ్యారు.....VIS

గతంలో ఉద్యోగులు తమకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాల కోసం ఉద్యమాలు, డిమాండ్లు చేసేవారు. కానీ జగన్‌ ప్రభుత్వంలో ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులు పీఆర్సీ అమలు, సీపీఎస్‌ రద్దు వంటి సీరియస్‌ అంశాలతో పాటు... ప్రతి నెలా జీతాల కోసం కూడా పోరాడాల్సి వచ్చింది. అంతకుముందు రెండు మూడు దశాబ్దాల్లో ఎప్పుడూ చూడని విచిత్రమైన పరిస్థితుల్ని జగన్‌ ప్రభుత్వంలో ఉద్యోగులు చూశారు. గతంలో ప్రతి నెలా ఒకటో తేదీనే పక్కాగా జీతాలు తీసుకోవడానికి అలవాటుపడ్డ ప్రభుత్వ ఉద్యోగులు... వారు కట్టాల్సిన వాయిదాలు, ఖర్చులనూ దానికి తగ్గట్టుగా ప్లాన్‌ చేసుకున్నారు. జగన్‌ ప్రభుత్వంలో జీతం ఎప్పుడు వస్తుందో తెలియని అనిశ్చిత పరిస్థితుల వల్ల తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

వైకాపా ఐదేళ్ల పాలనలో ఉద్యోగులకు నిత్యం ఇలాంటి అవమానాలెన్నో ఎదురయ్యాయి. బకాయిల గురించి ఎంతగా పోరాడుతున్నా కనీసం పట్టించుకోని ప్రభుత్వం... నాలుగైదు రోజుల క్రితం హఠాత్తుగా కొన్ని విభాగాల ఉద్యోగులకు సరెండర్‌ లీవ్‌ల బకాయిల్ని చెల్లించింది. ఒక్కొక్కరి ఖాతాలో 50 వేల నుంచి లక్ష వరకు జమ చేసింది. అంతటితో ఆగకుండా ఇప్పుడు ఏకంగా ఒకటో తేదీనే జీతం వేసేసింది. బుధవారం ఉదయం 8.30 నుంచే ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు పడటం మొదలైనట్టు తెలిసింది. సాంఘిక సంక్షేమశాఖ ఉద్యోగులు తమకు మధ్యాహ్నం వరకు జీతం పడలేదని ఆర్థికశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్తే, వారికీ హుటాహుటిన వేసేసినట్లు తెలిసింది.

Tags

Read MoreRead Less
Next Story