UP : యూపీలో ఘోర అగ్నిప్రమాదం.. ఐదుగురు సజీవ దహనం
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లక్నో (Lucknow) జిల్లా కకోరిలోని హతా హజ్రత్ సాహెబ్ ప్రాంతంలోగల ఓ రెండంతస్తుల భవనంలో అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఆ ఇంట్లోని ఐదుగురు సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా ప్రాంతానికి చేరుకుని మంటలను ఆర్పేశారు.
పోలీసులతో కలిసి క్షతగాత్రులను, మృతదేహాలను బయటికి తీసుకొచ్చారు. అనంతరం పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. పటాకుల పేలడం వల్లే ముందుగా మంటలు చెలరేగి, ఆ తర్వాత సిలిండర్ పేలినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
హతా హజ్రత్ సాహెబ్ నివాసి అయిన ముషీర్ అలీ (50).. జర్దోసీ పనితోపాటు పటాకుల వ్యాపారం కూడా చేస్తుంటాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఆయన ఇంటి రెండో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇంతలోనే సిలిండర్ పేలింది. ఇంట్లో ఉన్నవారు నిద్రలేచి బయటకు వచ్చేంతలోనే మంటలు ఇల్లంతా వ్యాపించాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com