శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్‌.. రూ.300 దర్శన టికెట్ల విడుదల

శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్‌.. రూ.300 దర్శన టికెట్ల విడుదల
తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్ల విడుదల... రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల... భక్తులకు ప్రత్యేక సూచనలు...

తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. సెప్టెంబర్‌ నెలలకు సంబంధించిన రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. టీటీడీ ప్రతీ నెలా నిర్దేశిత తేదీల్లో దర్శనం, ఆర్జితసేవలు, గదుల కోటాను ఆయా తేదీల్లో ఆన్‌లైన్‌లో ఓ షెడ్యూల్ ప్రకారం విడుదల చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా సెప్టెంబర్ నెలకు సంబంధించిరూ .300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల చేసింది. రేపు వసతి గదుల కోటాను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతున్నట్లు ప్రకటించింది. ఈ షెడ్యూల్ ప్రకారం భక్తులు టికెట్లు బుక్ చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది. ప్రస్తుతం తిరుమలలో దర్శనం కోసం 18 గంటల సమయం పడుతోంది. 18 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. అలిపిరి కాలినడక మార్గంలో ఏడో మైలు వద్ద బాలుడిపై చిరుత దాడి చేసిన ప్రదేశాన్ని పరిశీలించిన టీటీడీ ఈఓ ధర్మారెడ్డి... భక్తులకు పలు సూచనలు చేశారు. శ్రీవారి మెట్టు మార్గంలో సాయంత్రం 6 గంటల వరకు, అలిపిరి మార్గంలో రాత్రి 10 గంటల వరకు భక్తులను అనుమతిస్తామని తెలిపారు. సాయంత్రం 6 గంటల తర్వాత ఘాట్ రోడ్లలో వెళ్లే ద్విచక్ర వాహనదారుల భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై ఆలోచిస్తున్నట్టు ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. టీటీడీ అటవీ శాఖ అధికారులు చిరుత సంచారాన్ని గుర్తించారని, అలిపిరి గాలిగోపురం నుంచి నరసింహస్వామి గుడి వరకు చిరుత సంచరిస్తున్నట్టుగా తెలుస్తోందని చెప్పారు. ఈ కారణంగా రాత్రి 7 గంటల తరువాత అలిపిరి నడక మార్గంలో గాలిగోపురం నుంచి 200 మంది భక్తులను ఒక బృందంగా కలిపి పంపేలా ఏర్పాట్లు చేశామన్నారు. వీరితోపాటు సెక్యూరిటీ గార్డ్ ఉంటారని, భక్తులు గోవింద నామస్మరణ చేసుకుంటూ ముందుకు సాగుతారని చెప్పారు. చిన్నపిల్లలను బృందం మధ్యలో ఉంచుకుని, వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Tags

Read MoreRead Less
Next Story