Clay Pots : ఎండకాలం దంచేస్తుంది.. రంజన్లకు ఫుల్‌ డిమాండ్‌

Clay Pots : ఎండకాలం దంచేస్తుంది..  రంజన్లకు ఫుల్‌ డిమాండ్‌

వేసవికాలంలో మట్టి కుండలలో నీళ్లు తాగితే చల్లదనంతోపాటు ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుందనే విషయం తెలిసిందే. కాలానుగుణంగా ప్రతీ ఇంట్లో ఫ్రిజ్‌లు ఉన్నా మట్టితో తయారైన రంజన్లకు, కుండలకు డిమాండ్‌ తగ్గడం లేదు. ప్రస్తుతం ఎండలు తీవ్రరూపం దాల్చడంతో మట్టికుండలు, రంజన్లకు గిరాకీ పెరిగింది. రాజస్థాన్‌ తదితర ప్రాంతాల నుంచి తెప్పించిన రంజన్లు నగరంలోని పలు ప్రాంతాల్లో లభిస్తున్నాయి. వివిధ సైజుల్లో తయారైన మట్టి కుండలు, వాటర్‌ బాటిళ్లు, కూజాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. ఒక్కో రంజన్‌కు రూ. 150 నుంచి రూ. 400 వరకు ధర పలుకుతోంది. అలాగే మట్టితో తయారైన వాటర్‌ బాటిళ్లు, కుండలు, కూజాలను సైజ్‌లను బట్టి రూ. 100 నుంచి రూ. 250 వరకు విక్రయిస్తున్నారు.

ప్రస్తుతం వేసవికాలంలో ఫ్రిజ్‌లోని చల్లటి నీరు తాగేందుకు అందరూ ఆసక్తి చూపుతారు. కానీ ఫ్రిజ్‌కు బదులు మట్టి కుండలో నీరు తాగితే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. ఒకప్పుడు పల్లెల్లో ఎక్కడ చూసినా ఇంటి ఇంటికి ఓ కుండ ఉండేది. కానీ ఇప్పుడు ఇంటికొక ఫ్రిజ్ ఉంటుంది. అయితే ఫ్రిజ్ కొనుగోలు చేసే స్తోమత లేని వారు మాత్రం ఇప్పటికీ మట్టి కుండలో నీరే తాగుతున్నారు. మరికొందరు ఫ్రిజ్ ఉన్నా కుండలో వాటర్ ఆరోగ్యానికి మంచిదని మట్టి కుండలోని నీరు తాగుతుంటారు.

మట్టి కుండలో నీరు సహజంగా రుచిగా ఉంటాయి. ఆ నీరు తాగితే గ్యాస్, అసిడిటీ, శ్వాసకోశ సమస్యలు రావు. జీర్ణక్రియ కూడా మెరుగవుతుంది. ఈ నీటిని తాగడం వల్ల డీహైడ్రేషన్ నుంచి తప్పించుకోవచ్చు. జిడ్డు, మొటిమల నుంచి చర్మాన్ని కాపాడుకోవచ్చు. ఇక వేసవిలో చాలా మంది డీహైడ్రేషన్ బారిన పడుతుంటారు. కాగా, మట్టి కుండలోని నీరు ఆ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వడదెబ్బ తగిలిన వారికి కూడా ఈ నీరు మంచి ఔషధంగా పనిచేస్తాయి.

Tags

Read MoreRead Less
Next Story