లవర్స్‌ను బ్లాక్ మెయిల్ చేసి.. యువతిపై అత్యాచారయత్నం చేసిన ఖాకీలు

లవర్స్‌ను బ్లాక్ మెయిల్ చేసి.. యువతిపై అత్యాచారయత్నం చేసిన ఖాకీలు

ఓ ప్రేమజంట అటవీశాఖలోని తోడేళ్ల కీచత్వానికి బలైంది. ఒంటి మీద ఖాకీ డ్రస్ వేసుకున్న సోయి కూడా మరిచి ఓ యువతిఫై అత్యాచారయత్నం చేశారు ఫారెస్ట్ డిపార్ట్ మెంట్‌లో పని చేస్తున్న ఇద్దరు ఉద్యోగులు. ఈ దారుణం చిత్తూరు జిల్లాలో జరిగింది.

ప్రముఖ పర్యాటక కేంద్రం హార్స్‌లీ హిల్స్‌కు వెళ్లిన ఓ యువతిపై ఏకంగా అటవీశాఖ సిబ్బందే అత్యాచార యత్నానికి పాల్పడడం కలకలం రేపుతోంది. అనంతపురం జిల్లా కదిరికి చెందిన ఓ ప్రేమజంట హర్స్‌లీ హిల్స్‌కు చేరుకున్నారు. హిల్స్‌ సమీపంలోని గంగోత్రి సరోవరంలో కలిసి ఉన్న ప్రేమజంటను ఇద్దరు అటవీశాఖ ఉద్యోగులు.. రహస్యంగా వీడియోలు తీశారు. ఆ వీడియోలను వారికి చూపించి బెదిరింపులకు దిగారు. వారి దగ్గర ఉన్న డబ్బు, బంగారాన్ని లాక్కున్నారు. అంతటితో ఆగని కామాంధులు యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. యువకుడు గట్టిగా కేకలు వేయడంతో ఇద్దరు నిందితులు పరారయ్యారు.

బాధిత ప్రేమజంట, విషయం తెలుసుకున్న స్థానికులు అటవీశాఖ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. అత్యాచారానికి యత్నించిన ఇద్దరు ఉద్యోగులు కాంట్రాక్ట్‌ గార్డులుగా హార్స్‌లీ హిల్స్‌లో పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు గార్డులను సస్పెండ్‌ చేశారు ఫారెస్ట్‌ అధికారులు. అడవికి రక్షణగా.. పర్యాటకులకు భరోసాగా ఉండాల్సిన ఉద్యోగులు ఆత్యాచారాలకు తెగబడుతున్న దారుణాలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story