బీహార్ మాజీ ముఖ్యమంత్రి అంత్యక్రియల్లో పనిచేయని తుపాకులు
బీహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రా అంత్యక్రియల్లో జరిగిన ఓ ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది ఈ ఘటన. ప్రభుత్వ లాంఛనాలతో జగన్నాథ్ మిశ్రా అంతిమ సంస్కారాలు నిర్వహించింది బీహార్ ప్రభుత్వం. సీఎం నితీష్కుమార్ కూడా హాజరయ్యారు. గౌరవ వందనం సమర్పించే సమయంలో తుపాకులు పేలనేలేదు.
22 మంది పోలీసులు..తుపాకులను భుజాలపైకి ఎత్తారు.! ఫైర్ అంటూ ఉన్నతాధికారి ఆదేశించాడు. అంతే అందరూ ట్రిగర్ను నొక్కుతూనే ఉన్నారు. ఒకటి, రెండు, మూడు ఎన్నిసార్లు నొక్కినా, ఎంత బలాన్ని ప్రయోగించిన తుపాకి పేలలేదు. బుల్లెట్ బయటకి రాలేదు. ఏం జరుగుతుందో తెలియక అటు పోలీసులు.. ఆ ఉన్నతాధికారి అంతా బిక్కమొహం వేశారు.
తుపాకి ట్రిగ్గర్ మీద చేయి పడిపడగానే మెరుపువేగంతో బుల్లెట్ దూసుకెళ్లాలి. కానీ ఇక్కడ గన్లోంచి బుల్లెట్లు జారి పడిపోయాయే తప్ప..పొరపాటున కూడా పేలలేదు. అప్పటికప్పుడు వాటిని రిపేర్ చేసి..ఎదోలా పనికానిచేద్దాం అని ట్రై చేశారు. అది కూడా కుదర్లేదు. అంటే ఆ తుపాకులు, ఆ బుల్లెట్లు ఎంతగా పాడైపోయాయో అర్థం చేసుకోవచ్చు..సాధారణంగా గౌరవ వందనం పాటించేందుకు వెళ్లే ముందు ఓసారి తుపాకులను చెక్ చేసుకోవడం ఆనవాయితీ. ఇక్కడ అది కూడా జరగలేదని స్పష్టం అవుతోంది.. పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అటు సీఎం నితీష్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తి వివరణ కోరారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com