తెలంగాణ బీజేపీ నేతలు ఆ విషయాన్నీ సీరియస్ గా తీసుకున్నారా?
తెలంగాణలో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోన్న బీజేపీ..అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని అనుకూలంగా మార్చుకుంటోంది. ఏ చిన్న తప్పు దొరికినా దుమ్ము దులిపేస్తోంది. పదునైన అరోపణలతో ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు ఆ పార్టీ నేతలు. టీఆర్ఎస్ చేస్తున్న విమర్శలకు కూడా స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తున్నారు.. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగట్టడం ద్వారా.. ప్రజల్లో ఆదరణ పెంచుకునేలా ప్రయత్నాలు చేస్తున్నారు. హైకమాండ్ నుంచి కూడా మంచి ప్రోత్సాహం లభిస్తుండటంతో రాష్ట్ర నేతల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మునిసిపల్ చట్టంలో లొసుగులను ఎత్తి చూపుతూ గవర్నర్కు ఫిర్యాదు చేశారు బీజేపీ నేతలు. దీంతో ఆయన బిల్లును తిప్పిపంపారు. ఇంటర్ బోర్డులో జరిగిన అవకతవకల కారణంగా 27మంది విద్యార్దులు ఆత్మహత్య చేసుకోవడంపైనా... రాష్ట్రపతికి కంప్లైంట్ చేశారు. తాజాగా విద్యుత్ కొనుగోలు అంశంపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్లాన్ చేస్తోంది. భారీగా అవకతవకలు జరిగాయని , టెండర్లు పారదర్శకంగా జరగలేదని ఆరోపిస్తోంది బీజేపీ.
బీజేపీ ఆరోపణలపై స్పందించిన విద్యుత్ సరఫరా సంస్థల సీఎండీ ప్రభాకర్ రావు.. ఎవరికైనా అనుమానాలు ఉంటే సీబీఐ విచారణ జరిపించుకోవచ్చని సవాల్ విసిరారు. దీన్ని సీరియస్గా తీసుకున్న రాష్ట్ర నాయకత్వం ఇష్యూని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్ళేందుకు ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే జాతీయ కార్యదర్శి రాంమాధవ్తో చర్చించారు.. కేంధ్ర ప్రభుత్వ సంస్థతో విచారణ జరిపించేలా చూడాలని కోరినట్టు సమాచారం. తమ వద్ద ఉన్న ఆధారాలను కూడా ఆయనకు సమర్పించే పనిలో పడినట్టు సమాచారం. అన్ని కుదిరితే ఈ నెలలోపే దీనిపై పూర్తివివరాలు కేంద్ర ప్రభత్వానికి చేరేలా ప్రయత్నిస్తున్నారు రాష్ట్ర బీజేపీ నేతలు.
ఇప్పటికే మున్సిపల్ చట్టం, ఇంటర్ విద్యార్థుల సూసైడ్పై టీఆర్ఎస్ సర్కారుని ఇరుకున పెట్టిన బీజేపీ...విద్యుత్ కొనుగోళ్ల అవకతవకలపై కేంద్ర ప్రభుత్వ సంస్థతో విచారణ జరిపించేలా గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. అదే జరిగితే అందరి బండారం బయటపడుతుందని ఆపార్టీ నేతలు చెబుతున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com