దళితులు రావడానికి వీల్లేదని లోక్‌సభ సభ్యుడినే అడ్డుకున్న..

దళితులు రావడానికి వీల్లేదని లోక్‌సభ సభ్యుడినే అడ్డుకున్న..

ఆధునిక కాలంలోనూ కుల రక్కసి కాటు వేస్తోంది. ఉన్నత స్థాయి వ్యక్తులు కూడా కులోన్మాదం నుంచి తప్పించుకోలేకపోతున్నారు. బీజేపీ ఎంపీ ఎ.నారాయణ స్వామి ఉదంతమే ఇందుకు ఉదాహరణ.

బీజేపీ సీనియర్ నేత ఎ.నారాయణ స్వామి కర్నాటకలోని చిత్రదుర్గ నియోజకవర్గానికి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దళిత నాయకుడైన నారాయణ స్వామి తుమకూరు జిల్లాలోని ఓ గ్రామంలో పర్యటించడానికి వెళ్లారు. అక్కడ ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. దళితుడంటూ నారాయణ స్వామిని గ్రామస్థులు ఊళ్లోకి అడుగుపెట్టనివ్వలేదు. పేద ప్రజలను ఆదుకోవడానికి వచ్చామని నచ్చచెప్పడానికి ప్రయత్నించినప్పటికీ స్థానికులు పట్టించుకోలేదు. దళితులకు ప్రవేశం లేదంటూ ఎంపీని వెనక్కి పంపించారు.

పవడగ తాలూకా గొల్లరహట్టి గ్రామంలో పేదవారికి ఇళ్లు కట్టి ఇవ్వడంపై గ్రామస్థులతో చర్చించడానికి నారాయణ స్వామి వెళ్లారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబి లిటీ కింద చేపట్టిన ఈ కార్యక్రమంలో బయోకాన్ ఫార్మా కంపెనీ, నారాయణ హృదయాలయ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ఇళ్ల నిర్మాణంతో పాటు స్థానికంగా ఉన్న గుడిలోకి వెళ్లి దర్శనం చేసుకుందామనుకున్నారు. కానీ దళితుడంటూ నారాయణస్వామిని ఆపేశారు. అణగారిన వర్గానికి చెందిన వ్యక్తి గుడిలో అడుగు పెడితే కీడు జరుగుతుందంటూ ఎంపీని రానివ్వలేదు. గ్రామం వెలుపలే కూర్చోవాలంటూ ఎంపీకి గ్రామస్థులు ఒక కుర్చీ వేశారు. వారికి నచ్చచెప్పడానికి ఎంపీ ఎంతగా ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది.

వాదవివాదాల అనంతరం కొందరు గ్రామస్థులు కాస్త మెత్తబడ్డారు. ఊళ్లోకి రావాలని ఎంపీని కోరారు. అందుకు నారాయణస్వామి నిరాకరించారు. తాను ఊరి నుంచి వెళ్లిపోయిన తర్వాత గ్రామస్థులు తమలో తాము పోట్లాడుకుంటే అది మంచిది కాదని సూచించారు. గొల్లరహట్టిలోకి అడుగుపెట్టకుండానే వెనుదిరిగారు. పోలీసుల సాయంతో గ్రామంలోకి అడుగుపెట్టవచ్చని, కానీ అలా చేయడం తనకు ఇష్టం లేదని నారాయణస్వామి చెప్పారు. చట్టాలు చేస్తే సరిపోదని, ప్రజల ఆలోచనా ధోరణిలో మార్పు రావాలని ఆకాంక్షించారు.

పార్లమెంట్‌ సభ్యునికే ఇంతటి అవమానం జరిగితే ఇక సామాన్యుల పరిస్తితేంటీ..? కులం పేరుతో దళిత నాయకులను అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం..? ప్రస్తుతం ఇవే ప్రశ్నలు కర్నాటకలో చర్చనీయాంశమయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న తుమకూరు ఎస్పీ విచారణకు ఆదేశించారు.

Also watch :

Tags

Read MoreRead Less
Next Story