ఈ గుడిలో దేవుడు లేడు.. ఉన్నది బొమ్మే.. - యాదాద్రి ప్రధానార్చకులు
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ప్రధానార్చకులు నరసింహాచార్యులు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గుట్ట కింద రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఒక చిన్న గుడి తొలగింపు వివాదానికి కారణమైంది. మంగళవారం దీనికి సంబంధించిన పూజలు చేశాక, ఆలయ తొలగింపు పనులు ప్రారంభించారు అధికారులు. ఐతే.. స్థానికులు కూల్చివేతను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులుతో వాగ్వాదం జరిగింది. ఉన్నది చిన్న గుడి అయినా.. పెద్ద గుడైనా.. దేవుడే కదా..? అని స్థానికులు ప్రశ్నించారు. ఐతే.. ఇక్కడ ఉన్నది బొమ్మ అంటూ నర్సింహాచార్యులు మాట్లాడడం వివాదాస్పదమైంది. పండితులు, అన్నీ తెలిసిన వాళ్లే ఇలా మాట్లాడితే ఎలాగంటూ హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. వీహెచ్పీ, ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు ప్రధానార్చకుల తీరుపై నిరసన తెలిపారు.
ఈ వివాదంపై ప్రధానార్చకులు కూడా వివరణ ఇచ్చారు. స్థానికులు లేవనెత్తిన అభ్యంతరాలు తొలగించేలా తాను వారికి నచ్చచెప్పానని ఐతే.. తాను మాట్లాడిన మాటల్లో కొంత భాగాన్ని మాత్రమే తీసుకుని కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఈ తరహాలో తనకు వ్యతిరేకంగా అసత్య ప్రచారం జరుగుతుందని ఊహించలేదంటున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com