MANIPUR VOILENCE: మణిపుర్‌లో మళ్లీ హింస.. ఇద్దరి మృతి

MANIPUR VOILENCE: మణిపుర్‌లో మళ్లీ హింస.. ఇద్దరి మృతి
అల్లర్లతో ఇంకా అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రం... భద్రతా బలగాలు-సాయుధ మూకల మధ్య ఎదురుకాల్పులు..

ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌లో మళ్లీ హింస చెలరేగింది. తెంగ్నౌపాల్ జిల్లాలోని పల్లెల్ ప్రాంతంలో భద్రతా బలగాలు, సాయుధ మూకలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మృత్యువాత పడ్డారు. మరో 45 మందికి పైగా గాయపడ్డారు. కాల్పులు చాలాసేపటి వరకు కొనసాగినట్లు భద్రత దళాలు తెలిపాయి. ఘటనాప్రాంతంలో అదనపు బలగాలను మోహరించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. బిష్ణుపుర్ జిల్లాలోని ఫౌగాక్ చావో ఇఖాయ్‌లో వేలాదిమంది నిరసనకారులు గుమిగూడారు. టోర్ బంగ్ లోని వారి ఇళ్లకు చేరుకునేందుకు ఆర్మీ బారికేడ్ లను తొలగించేందుకు యత్నించారు. ఈ నిరసనలు జరగొచ్చన్న సమాచారంతో ఐదు లోయ జిల్లాల్లో మంగళవారమే అధికారులు కర్ఫ్యూ విధించినప్పటికీ ఆందోళనలు చెలరేగాయి. ఆ ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత తెంగ్నౌపాల్ లో కాల్పులు జరిగాయి.


ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో మే 3 వ తేదీ నుంచి పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడం ప్రారంభమైంది. మైదాన ప్రాంతాల్లో ప్రాబల్యం ఉన్న, జనాభా పరంగా మెజారిటీలుగా ఉన్న మెయితీ లకు ఎస్టీ హోదా కల్పించాలన్న ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ పర్వత ప్రాంతాల్లో ప్రాబల్యం ఉన్న గిరిజన కుకీ వర్గాలు నిరసనలు ప్రారంభించిన నేపథ్యంలో ఈ హింసాత్మక ఘటనలు ప్రారంభమయ్యాయి. రెండు వర్గాలు ఒకరిపై మరొకరు దారుణంగా దాడులకు పాల్పడడం ప్రారంభించారు. ఈ హింసలో ఇప్పటివరకు 160 మందికి పైగా మరణించారు. రాష్ట్ర జనాభాలో మెయిటీ కమ్యూనిటీ 53 శాతం మంది ఉన్నారు. వారు ప్రధానంగా ఇంఫాల్ లోయలో నివసిస్తున్నారు. నాగా, కుకి వంటి గిరిజన సంఘాలు జనాభాలో 40 శాతం ఉన్నారు. వారిలో ఎక్కువ మంది కొండ జిల్లాలలో నివసిస్తున్నారు.


మణిపూర్ అల్లర్ల అనంతరం నమోదైన కేసులపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. రాష్ట్ర పోలీసులు తమకు అప్పగించిన 27 కేసులపై సీబీఐ విచారిస్తోంది. ఇందులో 19 కేసులు మహిళలపై అఘాయిత్యాలకు సంబంధించినవే. మే 3న రాష్ట్రంలో చెలరేగిన హింసాకాండలో ఇప్పటివరకు 160 మందికి పైగా మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. 60 వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. అయితే మణిపూర్‌లో నెలకొన్న సున్నిత పరిస్థితుల దృష్ట్యా వివరాలను బయటకు వెల్లడించలేదు.


ఇటీవల ఐరాస నిపుణుల బృందం మణిపుర్‌లో తీవ్రమైన మానవహక్కుల ఉల్లంఘనలు, దాడులపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఓ నివేదిక విడుదల చేసింది. వీటిల్లో లైంగిక హింస, హత్యలు, గృహదహనాలు, బలవంతపు వలసలు, వేధింపులు, వివక్ష వంటి అంశాలను ప్రస్తావించింది. ఈ నివేదికపై స్పందించేందుకు ఉన్న 60 రోజుల గడువును కూడా దృష్టిలో పెట్టుకోకుండా విడుదల చేయడంపై ఐరాస భారత్ శాశ్వత బృందం అసహనం వ్యక్తం చేసింది.

Tags

Read MoreRead Less
Next Story