Jallikattu 2024: తమిళనాడులో మొదలైన జల్లికట్టు పోటీలు

Jallikattu 2024: తమిళనాడులో మొదలైన జల్లికట్టు పోటీలు
తరలివచ్చిన జనం.. విజేతలకు కార్లు

సంక్రాంతి సందర్భంగా ఏటా నిర్వహించే జల్లికట్టు పోటీలు తమిళనాడులో ఉత్సాహ వాతావరణంలో కొనసాగుతున్నాయి. ఎద్దులతో పోటీ పడి జరిగే ఈ పోటీలు తమిళనాడు సంప్రదాయంలో భాగంగా ఉన్నాయి. మధురై జిల్లాలో జరుగుతున్న జల్లికట్టు పోటీలను చూసేందుకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సంక్రాంతి సందర్భంగా జల్లికట్టు పోటీలు 3 రోజులు నిర్వహిస్తారు.

జనవరి 15న అవనియాపురం, 16న పాలమేడ్, 17న అలంకనల్లూరులో జల్లికట్టు పోటీలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో తమిళనాడు లోని మధురై జిల్లాలో ఈ జల్లికట్టు పోటీలు అట్టహాసంగా ప్రారంభించారు. జల్లికట్టు తమిళుల సంప్రదాయ క్రీడగా పరిగణిస్తారు. జంతువులకు ఏ హాని కలగకూడదంటూ జల్లికట్టుపై నిషేధం విధించాలని కోరుతూ ఓ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీన్ని నిరసిస్తూ మెరీనా బీచ్ లో మొదలైన నిరసన రాష్ట్రమంతటా వ్యాపించి పెద్ద ఎత్తున ఉద్యమంలా మారింది. జల్లికట్టులో గెలుపొందిన ఎద్దులకు, విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు, నజరానా సైతం అందజేస్తారు. ఈ ఏడాది సైతం తమిళనాడులో పలు ప్రాంతాల్లో జల్లికట్టు పోటీలు నిర్వహిస్తున్నారు.


మదురై జిల్లాలోని పలు ప్రాంతాల్లో నిర్వహించే జల్లికట్టు పోటీలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ఇక్కడ జరిగే జల్లికట్టులో పాల్గొనేందుకు భారీ సంఖ్యలో వస్తారు. పలు ప్రాంతాల నుంచి ఎద్దులను కూడా తీసుకొచ్చి జల్లికట్టు ఆడిస్తారు. ఈ ఏడాది కూడా మధురైలోని అలంకనల్లూరు, పాలమేడు, అవనియాపురంలో జల్లికట్టు పోటీలు ప్రతిష్టాత్మకంగా మొదలయ్యాయి. జల్లికట్టు ఆడుతూ కొందరు గాయపడినా, మిగతా వాళ్లు ఏ మాత్రం వెనక్కి తగ్గరు. ఈ నెలాఖరులోగా అలంకనల్లూరు సమీపంలోని కీజకరైలో కొత్తగా నిర్మించిన వేదికలో మిరమండ జల్లికట్టును తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రారంభించనున్నారు. జల్లికట్టు ఈవెంట్ మొదలైతే వరుసగా 5 రోజుల పాటు ప్రభుత్వం తరపున ఈ పోటీలు నిర్వహించనున్నారు. అవన్యాపురం, పాలమేడు, అలంకనల్లూరు జల్లికట్టు పోటీల్లో గెలిచిన ఎద్దుకు సీఎం ఎం.కె.స్టాలిన్‌ తరపున ఒక్కో కారు బహుకరిస్తారు. ఉత్తమ ఎద్దుల పోటీదారుడికి మంత్రి ఉదయనిధి తరఫున ఒక్కో కారును బహూకరిస్తారు. మొత్తం మూడు జల్లికట్టు పోటీల్లో మొత్తం 6 కార్లను బహుకరించనున్నారని అధికారులు తెలిపారు.

జనవరి 15, 16, 17 తేదీల్లో నిర్వహించే ఈ మూడు జల్లికట్టు పోటీల్లో పాల్గొనే ఎద్దులు, క్రీడాకారుల వివరాలను నిర్వాహకులు ప్రకటించారు. ఈ పోటీల్లో మొత్తం 12,176 ఎద్దులు, 4,514 మంది క్రీడాకారులు టోర్నీలో పాల్గొంటున్నారు. ఇందులో నేడు ప్రారంభైమన అవనియాపురంలో 2,400 ఎద్దులు, బాలమెట్‌లో 3,677, అలంకనల్లూరులో 6,099 ఎద్దులు పాల్గొంటాయని సమాచారం. గతేడాది 9,701 ఎద్దులు, 5,399 మంది ఆటగాళ్లు జల్లికట్టులో పాల్గొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story