Kashmir: వరుస హత్యలతో వణుకుతున్న కశ్మీర్.. నెల వ్యవధిలో నలుగురిని..

Kashmir: వరుస హత్యలతో వణుకుతున్న కశ్మీర్.. నెల వ్యవధిలో నలుగురిని..
Kashmir: వరుస హత్యలతో కశ్మీర్ లోయ వణకుతోంది. ఎందుకు చంపుతున్నారు? అనేది తెలియకుండా మనుషుల ప్రాణాలు తీస్తున్నారు.

Kashmir: వరుస హత్యలతో కశ్మీర్ లోయ వణకుతోంది. ఎందుకు చంపుతున్నారు? అనేది తెలియకుండా మనుషుల ప్రాణాలు తీస్తున్నారు. కశ్మీర్ లోయలో హిందువులే లక్ష్యంగా హత్యాకాండ కొనసాగిస్తున్నారు. నెల వ్యవధిలో నలుగురు హిందువులను కాల్చివేయడం అక్కడి ప్రజలకు భయాందోళనలు రేపుతున్నాయి. కశ్మీర్ లోయలో అసలేం జరుగుతుందో తెలియని ఆందోళన నెలకొంది.

ఎవరు ఎక్కడ్నించి వచ్చి కాల్చి చంపుతారోనని అక్కడి హిందువులు ప్రాణాలు చేతిలో పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. గత నెల రోజుల్లో నలుగురు హిందువులు తూటాలకు బలయ్యారు. గత నెలలో ప్రభుత్వ ఉద్యోగి రాహుల్ భట్ హత్య కాగా.. తర్వాత టీవీ నటిని చంపేశారు. అలాగే నిన్న టీచర్ రజనీ బాలాను దారుణంగా హత్య చేయగా.. తాజాగా కుల్గాంలో పోస్టింగ్ తీసుకున్న బ్యాంక్ మేనేజర్ విజయ్‌ను కాల్చి చంపేశారు.

దీంతో ప్రభుత్వ ఉద్యోగులు తమను వేరే ప్రాంతాలకు బదిలీ చేయాలని ప్రభుత్వాన్ని మొరపెట్టుకుంటున్నారు. అటు వరుస హత్యలను ఆపాలని, చంపుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కశ్మీర్ పండిట్లు ఆందోళన చేపట్టారు. మరోవైపు కశ్మీర్ లోయలోని తాజా పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా అత్యవసరంగా భేటీ అయ్యారు. టార్గెట్‌ కిల్లింగ్‌పై జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌తో కలిసి అమిత్ షా చర్చిస్తున్నారు.

అటు కశ్మీర్ పండిట్లపై దాడులను ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఖండించారు. కశ్మీర్‌లో పరిస్థితులకు కారణం కేంద్రమేనని అసదుద్దీన్ మండిపడ్డారు. 1989లో చేసిన తప్పులనే ప్రధాని మోదీ మళ్లీ చేస్తున్నారని ఆరోపించారు. సినిమాలను ప్రమోట్ చేయకుండా దేశాన్ని పాలించండి అంటూ చురకలంటించారు. కేంద్రం ఆధీనంలోనే ఉన్న కశ్మీర్‌లో దాడులు ఎలా జరుగుతున్నాయని అసద్దుద్దీన్ ప్రశ్నించారు.

Tags

Read MoreRead Less
Next Story