Maharashtra: ఆన్​లైన్​ బెట్టింగ్​లో 58 కోట్లు లాస్

Maharashtra:  ఆన్​లైన్​ బెట్టింగ్​లో 58 కోట్లు లాస్
ఆన్లైన్ బెట్టింగ్ లో నిండా మునిగిపోయిన మహారాష్ట్ర వ్యాపారి

టెక్నాలజీ యుగంలో స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ ల వినియోగం పెరగడంతో.. ఆన్ లైన్ గేమ్ లు కూడా కొత్త కొత్త దారులు వెతుక్కుంటున్నాయి. కష్టపడకుండా ఫోన్ లో ఆన్లైన్ గేమ్ ఆడితే చాలు.. గెలిస్తే డబ్బులు మీ సొంతం అంటూ యూజర్లను ఆకట్టుకుంటుండటంతో చిన్నా, పెద్దా తేడా లేకుండా చాలా మంది ఆన్లైన్ గేమింగ్ కు అలవాటు పడ్డారు. ఇక బెట్టింగ్ ల సంగతి అడగక్కరలేదు. మొదట ఇందులో సంపాదించేది కొందరే అయితే.. నమ్మి డబ్బు పెట్టి నష్టపోయేవారెందరో ఉన్నారు.

డబ్బులు ఆశ చూపి మహారాష్ట్రలో ఓ వ్యాపారవేత్తను నిండా ముంచేశాడు ఓ బుకీ. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ. 58 కోట్ల మేర మోసం చేశాడు. దీంతో బాధితుడు ఆత్మహత్య యత్నంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. మహారాష్ట్రలో నాగ్​పుర్​కు చెందిన ఓ వ్యాపారవేత్తకు గోందియా జిల్లాకు చెందిన అనంత్​ నవరతన్ జైన్​తో పరిచయం ఏర్పడింది. ఆన్​లైన్​ బెట్టింగ్ ద్వారా తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని వ్యాపారిని నమ్మించాడు నిందితుడు అనంత్​. అనంతరం బాధితుడికి వాట్సాప్​లో ఆన్​లైన్​ లింక్​లు పంపించి బెట్టింగ్ అలవాటు చేసాడు. క్రమంగా బెట్టింగ్ కు అలవాటు పడేలా చేశాడు. అయితే, మొదటి సందేహించిన వ్యాపారి.. ఆ తర్వాత రూ. 8 లక్షలు నిందితుడికి పంపించి బెట్టింగ్ ప్రారంభించాడు.


మొదటలో రూ. 5 కోట్లు గెలవడంతో అనంత్​ను పూర్తిగా నమ్మాడు వ్యాపారి. తక్కువ డబ్బులు పందెం వేసినప్పుడల్లా గెలవడంతో స్నేహితులు, బంధువుల వద్ద నుంచి అప్పు చేసి మరీ జూదం ఆడాడు కొంతకాలం గడచిన తరువాత నష్టాలు రావడం ప్రారంభమయ్యాయి. నవంబర్​ 2021 నుంచి ఇప్పటివరకు రకరకాల జూదాలు ఆడి.. ఏకంగా దాదాపు రూ. 58.42 కోట్ల వరకు నష్టపోయాడు. ఈ వ్యవహారంపై అనుమానం వచ్చిన బాధితుడు.. తన డబ్బు వాపస్‌ ఇవ్వాలని అనంత్ ​ను అడిగాడు. దీనికి అనంత్ అంగీకరించలేదు సరి కదా తనకే తిరిగి రూ. 40 లక్షలు ఇవ్వాలని డిమాండ్​ చేశాడు. దీంతో మోసపోయానని గ్రహించిన ఆ వ్యాపారవేత్త ఆత్మహత్య చేసుకోడానికి ప్రయత్నించాడు.

నిందితుడు ప్రణాళిక ప్రకారంమే తప్పుడు లింక్​లు పంపించి తనను మోసం చేసినట్లు బాధితుడు ఇప్పుడు సైబర్ పోలీసులను ఆశ్రయించాడు. వ్యాపారవేత్త ఇచ్చిన ఫిర్యాదుతో నాగ్‌పుర్ పోలీసులు కాకా చౌక్‌లోని బుకీ నివాసంపై దాడి చేశారు. 17 కోట్లకు పైగా డబ్బు, 4 కిలోల బంగారం, 200 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. అతడు దుబాయ్‌ పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story