Rahul Gandhi: రాయ్‌బరేలీ నుంచి రాహుల్‌

అమేథీ నుంచి కిశోరీ లాల్‌

ఎత్తకేళకు రాయ్‌బరేలీ, అమేథీ స్థానాలకు కాంగ్రెస్ హైకమాండ్ అభ్యర్థులను ప్రకటించేసింది. కాంగ్రెస్‌కంచుకోటలు అయిన ఉత్తరప్రదేశ్‌లోని అమేథి, రాయ్‌బరేలి స్థానాల నుంచి పోటీ చేసే కాంగ్రెస్‌ అభ్యర్థులపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. రాయ్‌బరేలి నుంచి పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీబరిలోకి దిగుతున్నట్లు ఏఐసీసీ ప్రకటించింది. అదేవిధంగా అమేధీ నుంచి గాంధీ కుటుంబ విధేయుడు కిశోరీ లాల్‌ శర్మను రంగంలోకి దించింది. ఈమేరకు కాంగ్రెస్‌ పార్టీ ఎక్స్‌ వేదికగా జాబితాను విడుదల చేసింది. ఈ రెండు స్థానాల్లో నేటితో నామినేషన్ల గడువు ముగియనుంది.

మరికొద్ది సేపట్లో రాహుల్‌గాంధీ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇందుకోసం పార్టీ శ్రేణులు రాయ్‌బరేలీలో ఏర్పాట్లు చేస్తున్నారు. సోనియాగాంధీ ఈసారి ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఆమె రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. దీంతో రాయ్‌బరేలీ స్థానం ఖాళీ అయింది. అయితే సోనియా స్థానంలోకి కుమార్తె ప్రియాంక రావొచ్చని వార్తలు వినిపించాయి. కానీ చివరికి రాహులే బరిలోకి దిగారు. ఇక కాంగ్రెస్ సీనియర్ నాయకుడు.. గాంధీ కుటుంబానికి వీర విధేయుడైన కేఎల్. శర్మను అమేథీ నుంచి బరిలోకి దించారు.

అమేథీ నుంచి కాంగ్రెస్‌ తరఫున కిశోరి లాల్‌ శర్మను పోటీలోకి దించారు. ఈయన సోనియా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడుగా చెబుతారు. కేఎల్‌ శర్మ స్వస్థలం పంజాబ్‌లోని లిథియానా. అమేథీలో కాంగ్రెస్‌ ప్రతినిధిగా ఉండే వాళ్లు. ఆ నియోజకవర్గంలో అణువణువూ ఆయనకు తెలుసు. కాంగ్రెస్ ఐడియాలజీని, అప్పటి యూపీఏ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో కీలక పాత్ర పోషించింది ఈయనే.

రాయ్‌బరేలీ, అమేథీ స్థానాలకు మే 20న పోలింగ్ జరగనుంది. ఇక ఈ రెండు స్థానాలకు శుక్రవారమే నామినేషన్‌కు చివరి రోజు. ఈసారి ప్రియాంక రాజకీయాల్లోకి రావొచ్చని ప్రచారం జరిగింది. కానీ ఈసారి కూడా ఆమె ఎంట్రీ ఇవ్వలేదు. విమర్శలకు భయపడే ఆమె వెనక్కి తగ్గినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే గాంధీ కుటుంబం నుంచి ఉభయసభల్లో సోనియా, రాహుల్ ఉన్నారు. ఇప్పుడు ప్రియాంక కూడా బరిలోకి దిగితే.. బీజేపీ నుంచి విమర్శలు ఎదుర్కోవల్సి వస్తుందన్న భావనతోనే ప్రియాంక వెనకడుగు వేసినట్లు సమాచారం. గాంధీ కుటుంబంపై బీజేపీ నుంచి విమర్శలు రాకూడదన్న భావనతోనే ప్రియాంక పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే రెండు విడతల్లో పోలింగ్ జరగింది. ఇక మూడో విడత మే 7న జరగనుంది. అనంతరం మే 13, 20, 25, జూన్ 1న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదలకానున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story