రయ్యిమంటున్న నైరుతి రుతుపవనాలు

రయ్యిమంటున్న నైరుతి రుతుపవనాలు
కర్ణాటక, తమిళనాడు, ఏపీలోని పలు ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడి

నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. కర్ణాటక, తమిళనాడు, ఏపీలోని పలు ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణలోకి వచ్చే వారం ప్రవేశించే అవకాశాలున్నాయని అంచనా వేసింది. అయితే రాబోయే రెండ్రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

బిపోర్‌జాయ్‌ తుఫాను అతితీవ్రంగా మారింది. ప్రస్తుతం గుజరాత్‌ వైపు దూసుకువస్తుందని IMD వెల్లడించింది. కొన్నిగంటల్లో మరింత బలపడి.. గుజరాత్‌లోని కచ్‌, పాక్‌లోని కరాచీ మధ్య రేపు తీరాన్ని దాటే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే గుజరాత్‌ తీర ప్రాంతాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. గుజరాత్‌తో పాటు కర్ణాటక, గోవాల్లోనూ ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లోనూ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. తుఫాను నేపథ్యంలో ఈ నెల 15 వరకు మత్స్యకారులు వేటకు సముద్రంలోకి వెళ్లొద్దని వాతావరణ శాఖ సూచించింది. మరోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజలను తాత్కాలికంగా ఏర్పాటు చేసిన షెల్టర్లలోకి తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు దాదాపు 1,300 మందిని తరలించినట్లు వివరించారు.

Tags

Read MoreRead Less
Next Story