తెలంగాణలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. మధ్యాహ్నం ఎండలు తీవ్రంగా ఉంటే.. సాయంత్రం వర్షం కురుస్తోంది. రాత్రి ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గతకొన్ని రోజులుగా ఇవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిన్న గరిష్ఠంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్లో 44.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిర్మల్, ఖమ్మం, జగిత్యాల, ఆదిలాబాద్ జిల్లాల్లోని పలు మండలాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలో మరో మూడ్రోజుల పాటు సాధారణం కన్నా 3 డిగ్రీల వరకు అధికంగా ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. మే నెలల్లో 44 నుంచి 46 డిగ్రీలకు పెరగవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మరోవైపు.. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లోని పలుప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. కొన్ని చోట్ల వడగళ్లు పడ్డాయి. నాంపల్లిలో గరిష్ఠంగా 1.8 సెం.మీటర్లు, బహదూర్పురలో 1.6 సెం.మీటర్ల వర్షం కురిసింది. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోనూ వర్షం కురిసింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com