MOTHKUPALLY: చంద్రబాబును చంపే కుట్ర

MOTHKUPALLY: చంద్రబాబును చంపే కుట్ర

వైసీపీ ప్రభుత్వం చంద్రబాబు ఆరోగ్యాన్ని దెబ్బతీసి చంపేందుకు కుట్ర చేస్తోందని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన ఆయన..చంద్రబాబు విషయంలో జగన్ సర్కారు వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ తాను దసరా పండుగ జరుపుకోవడం లేదని, ఉపవాస దీక్ష చేయనున్నట్లు మోత్కుపల్లి తెలిపారు. తన రాజకీయ అనుభవంలో చంద్రబాబు ఏనాడూ.. కక్ష్య సాధింపులకు పాల్పడలేదని ఆయన అన్నారు. చంద్రబాబుకు ఏమైనా అయితే..తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.

మరోవైపు ట్యాంక్‌బండ్‌‌ ఎన్టీఆర్ ఘాట్ దగ్గర మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు పురుగుల మందు డబ్బాతో హల్‌చల్ చేశారు. సీఎం కేసీఆర్‌ను సమర్థించి తప్పుచేశానని మోత్కుపల్లి పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. దళితబంధు అమలు కావటం లేదని తనను చనిపోమని దళిత యువత తనకు మెసేజ్‌లు చేస్తున్నారని అన్నారు. యాదగిరిగుట్ట దగ్గర చెప్పిన మాటను నిలబెట్టుకోమని దళిత యువత కోరుతోంది. కేసీఆర్ ముహూర్తం పెడితే గడ్డి మందు తాగి చనిపోతాను. దళితులకు అన్యాయం జరిగితే గడ్డి మందు తాగి చచ్చిపోతానని కేసీఆర్ గట్టిగా ఉన్నాడు.‌ ఆయన ఎలాగూ చావడు. నేనైనా చచ్చిపోతానని మోత్కుపల్లి అన్నారు. తన పెద్దన్న కేసీఆర్ మాటకు విలువే లేదన్న మోత్కుపల్లి మోసాలకు కేరాఫ్ అడ్రస్ సీఎం కేసీఆర్ అన్నారు. తమ ఇద్దరకీ మాటలు లేకున్నా.. దళితబంధు పెడ్తున్నాను రావాలని స్వయంగా కేసీఆర్ పిలిస్తే వెళ్లానని, దళితబంధుతో దళిత జాతికి మేలు జరుగుతోందని కేసీఆర్‌ను సమర్థించాని అలా సమర్థించి తప్పు చేశానని అన్నారు.


Next Story